ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక ప్రత్యేక దృష్టి పెట్టిన విభాగాల్లో రైల్వేలు ముఖ్యమైనవి. బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైల్వేల విస్తరణకు, నాణ్యమైన సేవలకు పెద్దపీట వేస్తున్నది. వందే భారత్, దూరంతో వంటి ఆధునిక రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. దీంతోపాటు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించేందుకు చొరవ తీసుకున్నది.
వేసవి సందర్భంగా ఇప్పటికే రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నిర్వహిస్తోంది. ప్రతి రైల్లోనూ స్లీపర్ క్లాస్ తో పాటు జనరల్ బోగీలు ఉండే చోట ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరుస్తుంది.
సామాన్య ప్రయాణికుల కోసం తాజాగా ఎకానమీ మీల్స్ పేరుతో రూ.20 లకే నాణ్యమైన భోజనం అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం రైల్వే స్టేషన్ లో జనరల్ బోగీలు ఆగే చోట ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. రూ.20 లకే ఎకానమీ మీల్స్, రూ.50 లకు స్నాక్ మీల్స్ అందిస్తున్నారు. వేసవిలో ప్రయాణికులకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలని ఐఆర్ సీటీసీతో కలిసి ఈ ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
జనరల్ బోగీలలో ప్రయాణించే ప్రయాణికుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఈ కౌంటర్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వేసవి పూర్తయ్యే వరకూ ఈ స్పెషల్ కౌంటర్ లు ఉంటాయని వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంపిక చేసిన స్టేషన్ లలో ఈ సౌకర్యాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కౌంటర్లను ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్ , విజయవాడ, రాజమహేంద్రవరం స్టేషన్లలో ఏర్పాటు చేశారు. ఈ సేవలకు ప్రయాణికుల నుంచి కూడా చక్కటి స్పందన లభిస్తోంది. మండుటెండల్లో ప్లాట్ఫామ్ మీదే శుభ్రమైన భోజనం దొరకడం పట్ల ప్రయాణీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
You must log in to post a comment.