ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. భారతదేశంలో మంటలు పెట్టేందుకు తీవ్రంగా పనిచేస్తున్న ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ .. సిక్స్ ఫర్ జస్టిస్..నుంచి సుమారు 134 కోట్ల రూపాయల డబ్బులు దండుకున్నారని ఆయన మీద ఫిర్యాదు అందింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా కలిపి వరల్డ్ హిందూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫిర్యాదును నమోదు చేసింది. ఈ ఆధారాల్ని పరిగణలోకి తీసుకొని ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వి కే సక్సేనా… ఈ మొత్తం ఎపిసోడ్ మీద జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తో దర్యాప్తు చేయించాలని కేంద్రానికి లేఖ రాశారు.
వివరాలు చూసినట్లయితే చాలా కాలంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్న సంస్థగా సిక్స్ ఫర్ జస్టిస్ ని గుర్తించారు. ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లు లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన కేసులో ఈ సంస్థ నాయకుడు దేవేంద్ర సిం భుల్లార్ ప్రధాన దోషి. దీని మీద విచారణ జరిపిన టాడా కోర్టు 2021లో ఆయనకు మరణశిక్ష విధించింది. తర్వాత కాలంలో సుప్రీంకోర్టు దీనిని జీవిత ఖైదుగా మార్చింది . అనంతరం బెయిల్ కోసం దేవేందర్ సింగ్ తరపున చాలా ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో 2023 డిసెంబర్లో సమావేశమైన ఢిల్లీ ప్రభుత్వ శిక్షా సమీక్ష బోర్డు బెయిల్ కానీ ముందస్తు విడుదల కానీ.. వీలు కాదని స్పష్టం చేసింది. అయితే అంతకుముందే దేవేందర్ సింగ్ ను బయటకు రప్పించేందుకు 2014 22 మధ్యకాలంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ విడతలవారీగా 134 కోట్ల రూపాయలు దండుకున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి న్యూయార్క్ లోని రిచ్మెంట్ హిల్స్ గురుద్వారా లో ఖలిస్తాన్ అగ్ర నేత గురుపత్వంత్ సింగ్ పన్ను చేసిన ప్రసంగంలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి . స్థానిక సిక్కు యువకులు.. దీనిని వీడియో తీయడంతో ఆ వీడియో కాస్త బయటకు పొక్కింది. దీంతో కేజ్రీవాల్ పార్టీకి ఉగ్రవాద సంస్థల నుంచి కోట్ల రూపాయలు నిధులు అందుతున్నాయి అన్న విషయం బయటపడింది. మరోవైపు అదే రిచ్ మెంట్ గురుద్వారాలో ఖలిస్థాన్ నాయకులతో కేజ్రీవాల్ సమావేశమైన చిత్రాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఆప్ మాజీనేత మునిష్ కుమార్ ..వీటిని పోస్ట్ చేశారు. దీంతో ఢిల్లీ వర్గాల్లోనూ దీని మీద చర్చ నడుస్తోంది. మరోవైపు ఇదంతా బిజెపి కుట్ర అని ఆప్ చెబుతోంది.