ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటికే బాగా వేడెక్కుతున్నాయి . అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికార వైసిపి దూకుడు పెంచుతోంది . దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతిపక్ష కూటమి కూడా బలంగా పావులు కదుపుతోంది. తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల మధ్య అంతరం తగ్గించి కలిసికట్టుగా పనిచేసే దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో బిజెపి కీలక నేతలు సమావేశం అయ్యారు.
ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. బిజెపిలో నిర్ణయాలు తీసుకునేది, ప్రభావం చూపించేది సంఘటన కార్యదర్శి హోదా కలిగిన నాయకులు మాత్రమే . చంద్రబాబుతో సమావేశానికి ఆ హోదా కలిగిన ముగ్గురు నాయకులు తరలి వచ్చారు. ఎటువంటి ప్రచారం లేకుండా గప్ చుప్ గా సమావేశం అయ్యారు. బిజెపి జాతీయ కార్యదర్శి హోదాలో అరుణ్ సింగ్ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. బిజెపిలో దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జిగా ఉన్న సంఘటన మంత్రి శివ ప్రకాష్, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల సంఘటన మంత్రి మధుకర్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి తరుపున ఎన్నికల హామీలు ఉమ్మడి మేనిఫెస్టో మీద చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేంద్రంలో ఎన్డీఏ, ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడుతుందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇందుకు తగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేయబోయే పనులను విభజించి వాటి ఆధారంగా మేనిఫెస్టో రూపొందించాలని నిర్ణయించుకున్నారు. మొత్తం మీద చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కీలక భేటీ రానున్న కాలంలో బలమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి అగ్ర నేతలతో బహిరంగ సభలు నిర్వహించడం మీద కూడా ఈ భేటీలో చర్చించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.