మళ్లీ రాహుల్ గాంధీనే కావాలట.. యూత్ కాంగ్రెస్ తీర్మానం.
కాంగ్రెస్ పార్టీ చీఫ్గా మళ్లీ రాహుల్ గాంధీనే కావాలంటూ యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఓటమి అనంతరం ఆయన పార్టీ పగ్గాలకు రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడిగా మరోసారి రాహుల్ గాంధీనే బాధ్యతలు చేపట్టాలని యూత్ కాంగ్రెస్ జాతీయ కోరుకుంటుంది. అంతేకాదు మంగళవారం నాడు జరిగిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం కూడా చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశాలు కొనసాగనున్నాయి. యూత్ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు బీఎస్ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి.
అయితే పార్టీ సంస్థాగత ఎన్నికలకు ముందే.. రాహుల్ గాంధీ పార్టీ చీఫ్గా ఉండాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేతలు, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ అనుబంధ సంస్థలు అనేకమార్లు తీర్మానాలు చేశాయి. అయితే వాటన్నింటిని రాహుల్ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. తాజాగా మరో రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలకు రెడీ అవుతున్న తరుణంలో మరోసారి అధ్యక్ష పదవి బాధ్యత ప్రాధాన్యత సంతరించుకుంది. వెస్ట్ బెంగాల్,అసోం, తమిళనాడు,కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ముగిసన తర్వాత.. జూన్లో కాంగ్రెస్ పార్టీకి నూతన రథసారథి కోసం ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంస్థలు కూడా రాహుల్ పేరును ప్రస్తావిస్తుండటంతో మరోసారి కూడా రాహుల్ గాంధీనే పార్టీ రథసారథిగా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రాహుల్ పార్టీ పగ్గాలు తీసుకుంటాడా..? లేదా గాంధీ కుటుంబం నుంచి కాకుండా ఇతరులకు ఎవరికైనా అప్పగిస్తారా..? అన్నది చూడాలి.