మేకిన్ ఇండియాను ఎగతాళి చేస్తున్నారంటూ కాంగ్రెస్ పై, ఆ పార్టీ నాయకులపై మండిపడ్డారు ప్రధాని మోదీ. వారిని తుక్డే గ్యాంగ్ నాయకులుగా అభివర్ణించారు. కమీషన్లు, అవినీతికి తావులేకుండా చూస్తున్నందునే మేక్ ఇన్ ఇండియాను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు.
లోక్ సభలో మేక్ ఇన్ ఇండియాపై మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మంచి పథకాన్ని అపహాస్యం చేస్తూ వాళ్లే జోకర్లుగా మిగిలిపోతున్నారని విపక్షాలనుద్దేశించి అన్నారు ప్రధాని. మేక్ ఇన్ ఇండియా సాధ్యం కాదని కొందరు అన్నారని…పరోక్షంగా రాహుల్ ను ఉద్దేశించి అన్నారు.
“మేక్ ఇన్ ఇండియా గురించి వారు ఒక జోక్ లాగా మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని వారు అపహాస్యం చేశారు. కానీ భారత పారిశ్రామికవేత్తలు మేక్ ఇన్ ఇండియా సామర్థ్యం ఏమిటో చూపించారు. మేక్ ఇన్ ఇండియా విజయం మీకు ఎంత బాధ కలిగించిందో నేను అర్థం చేసుకోగలను’ అని ప్రధాని మోదీ అన్నారు. కొందరు మేక్ ఇన్ ఇండియా వల్ల ఇబ్బంది పడుతున్నారని…అందులో కమీషన్లు, అవినీతి లేనందునే వారు దాన్ని వ్యతిరేకిస్తున్నారనీ మోదీ అన్నారు.
స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలనే మహాత్మా గాంధీ వ్యాఖ్యలు ప్రేరణగా మేక్ ఇన్ ఇండియా ప్రారంభించినట్టు చెబుతూ… మేం స్థానికత, స్థానికుల గురించి మాట్లాడుతూ మహాత్మాగాంధీ కలల్ని నేరవేరుస్తుంటే విపక్షాలు ఎందుకు అపహాస్యం చేస్తున్నాయో అర్థం కావడం లేదని అన్నారు.
అర్థవంతమైన విమర్శలకు తమ సర్కారు సిద్ధంగా ఉందని…సంపద సృష్టికర్తలుగా మారిన యువత, పారిశ్రామికవేత్తలను భయపెట్టే విపక్షాల కుట్రల్ని, వ్యూహాల్ని సహించబోమని అన్నారు. సూచనలు చేయండి తప్ప అది విఫలమవుతుందని మీరెలా అనగలరని ప్రశ్నించారు.
విభజించి పాలించు విధానంలో పనిచేస్తున్న ‘తుక్డే తుక్డే గ్యాంగ్’ నాయకుడిగా ముద్రవేసి, వేర్పాటువాద విధానాలను అనుసరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. “అంగ్రేజ్ చలే గయే…బ్రిటీష్ వారు వదిలివెళ్లారు. కానీ విభజించి పాలించడం ఇంకా మిగిలి ఉందది. అది కాంగ్రెస్ పార్టీ లక్షణం. అందుకే అది తుక్డే, తుక్డే గ్యాంగ్ ను లీడర్ గామారిందని మోదీ అన్నారు.
గత వారంలో రాహుల్ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా ఇక ముగిసిందని దేశంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నిలిచిపోయినట్టేనని..అందువల్ల మేక్ ఇన్ ఇండియా ఇక జరగబోదనీ అన్నారు. లోక్ సభ వేదిగ్గా రాహుల్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ఆయనపై ఫైరయ్యారు మోదీ.