యూపీ సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. ఇక ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఎక్కడ నుంచి పోటీచేయనున్నారనే దానిపై చర్చ నడుస్తోంది. ఆయన అయోధ్య నుంచి నిలిస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతుండగా యోగీ మనసులోనూ అదే ఉందని చెబుతున్నారు.. ప్రస్తుతం ఆయన కౌన్సిల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి పోటీ చేస్తానని ఆయన కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. అటు పార్టీ అధిష్ఠానం సైతం ఆయన్ని అయోధ్యకు పంపే యోచనలో ఉన్నట్టు తెలిసింది. అయోధ్య బీజేపీ సిట్టింగ్ స్థానం. అది అవధ్ ప్రాంతానికొస్తుంది. కానీ అవధ్ మిగతా ప్రాంతంలో సమాజ్ వాదీకి గట్టి పట్టుంది. అయితే మోదీ సర్కారు విజయాల్లో అయోధ్య కేసు…రామజన్మ భూమి వివాద పరిష్కారాన్ని ప్రథమంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులూ సాగుతున్నాయి. ఇప్పుడు యోగీని అయోధ్యలో పోటీకి పెడితే కనుక ఆ ప్రభావం అవధ్ అంతటా పడుతుందని పార్టీ అంచనా వేస్తోంది. అయోధ్య కాకుంటే మథుర లేదా గోరక్ పూర్లలో ఒకస్థానం నుంచి ఆయన పోటీకి దిగే అవకాశం ఉంది.