చాలా కాలం తరువాత మాతృమూర్తి సావిత్రీదేవిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగీ. 28 ఏళ్ల సుదీర్ఘకాలం తరువాత ఆయన తన సొంతూరు ఉత్తరాఖండ్ లోని పంచూర్ వెళ్లారు.తన ఆధ్యాత్మిక గురువు మహంత్ వైద్యనాథ్ విగ్రహావిష్కరణ కోసం వెళ్లిన ఆయన చాలా కాలం తరువాత తాను పుట్టిపెరిగిన ఇంటికి వెళ్లి కాసేపు గడిపారు. సన్యాసిగా మారిన తరువాత దాదాపు 30 ఏళ్ల పాటు ఆయన తన కుటుంబంలో ఏ వేడుకకు, కార్యక్రమానికీ హాజరుకాలేదు. కోవిడ్ సమయంలో తండ్రి చనిపోతే లాక్ డౌన్ నిబంధనల కారణంగా చివరి చూపునకూ వెళ్లలేకపోయారు. యూపీ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన తన తల్లిని చూడ్డం ఇదే మొదటిసారి.
माँ pic.twitter.com/3YA7VBksMA
— Yogi Adityanath (@myogiadityanath) May 3, 2022
అన్నేళ్లకు కన్నకొడుకును చూసి సావిత్రీదేవి తీవ్ర ఉద్వేగానికి గురైంది.యోగీ ఆమెకు శాలువా కప్పి…పాదాలకు నమస్కరించారు. సన్యాసి అయిన తరువాత ఒక్క తల్లికి పాదనమస్కారం చేయాలి. అమ్మ అనే క్యాప్షన్ తో ఆ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు యోగీ. ఆ కుటుంబంలో జరిగే ఓ వేడుకలోనూ యోగీ పాల్గొన్నారు. సన్యాసిగా మారిన తరువాత ఆ కుటుంబంతో ఆయనకు సంబంధాలే లేకుండా పోయాయి. అయితే యోగీ యూపీ ముఖ్యమంత్రి అయిన తరువాతనే ఆ కుటుంబం గురించిన వివరాలు బయటిప్రపంచానికి తెలిశాయి. యోగీ కుటుంబసభ్యులు అతి సాధారణ జీవితం గడుపుతున్నారు. మొన్నటి ఎన్నికల సందర్భంగా ఇప్పటికీ వ్యవసాయ పనులు చేస్తూ…చిన్న కొట్టు పెట్టుకుని జీవిస్తున్న సోదరి శశి గురించి ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూలో ప్రస్తావించగా…తానిప్పుడు శశికి మాత్రమే సోదరుడిని కానని…భారతదేశంలో ఉన్న ఆడపడుచులందరికీ అన్నను అని, యూపీ పాలకుడిగా ప్రజలందరిబాధ్యతా తనదని యోగీ చెప్పారు.
తన సొంతూరు వెళ్లేముందు పౌరీ-గర్వాల్లోని మహాయోగి గురు గోరఖ్నాథ్ ప్రభుత్వ కళాశాలలో తన గురువు మహంత్ వైద్యనాథ్ విగ్రహాన్ని యూపీ సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యోగి ఉద్వేగానికి లోనయ్యారు. తాను జన్మించిన స్థలంలో తన ఆధ్యాత్మిక గురువు విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు. ఉత్తరాఖండ్ పర్యటన సందర్భంగా డెహ్రాడూన్ లో పలు కార్యక్రమాల్లోనూ యోగీ పాల్గొన్నారు.