మంత్రులు వారు, వారి కుటుంబసభ్యుల పేరిట ఉన్న అన్ని ఆస్తుల వివరాల వెల్లడించాలని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశించారు.
ఆస్తుల వివరాలను ఆన్లైన్లో ఉంచాలని ఐఎఎస్, ఐపిఎస్ అధికారులనూ కోరారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో మంత్రుల కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోకూడదన్నారు.
కేబినెట్ సమావేశం అనంతరం ప్రత్యేక సమావేశంలో సీఎం ప్రసంగిస్తూ.. ఐఏఎస్, ఐపీఎస్, ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్ అధికారులు తమ ఆస్తులను.. తమ కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించాలని, వాటిని ఆన్లైన్ ప్లాట్ఫారమ్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కోసం ప్రజా ప్రతినిధుల ప్రవర్తన చాలా ముఖ్యం అనిఅన్నారు యోగి. మంత్రులందరూ తమ కుటుంబ సభ్యులకు చెందిన అన్ని చర, స్థిరాస్తులను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడు నెలల వ్యవధిలో ప్రకటించాలని ఆదిత్యనాథ్ అన్నారు.
ఎవరూ తమ కుటుంబ సభ్యుల జోక్యం లేకుండా చూసుకోవాలని, మన ప్రవర్తన ద్వారా మనం ఆదర్శంగా నిలవాలని ఆయన అన్నారు.
నిర్ణీత గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి అన్ని శాఖలను ఆదేశించారు. వచ్చే 100 రోజులు, ఆరు నెలల పాటు అన్ని శాఖల ప్రజెంటేషన్, ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని సీఎం తెలిపారు. ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో ‘అంత్యోదయ’ తీర్మానాన్ని అమలుపర్చడానికి అందరూ కృషి చేయాలని సూచించారు.
యోగి ఆదిత్యనాథ్ 18 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేబినెట్ మంత్రి నేతృత్వంలో, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి.. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి స్థానిక నాయకులు, జిల్లాల్లోని ప్రముఖులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.. వచ్చే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే ఈ మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటన పూర్తి చేస్తారని చెప్పారు.
18 మంది బృందం శుక్రవారం నుంచి ఆదివారం వరకు అన్ని విభాగాలను సందర్శిస్తుంది. రాష్ట్రంలో 18 డివిజన్లు ఉండగా వాటి కింద 75 జిల్లాలు ఉన్నాయి. ఈ మూడు రోజుల పర్యటనల్లో ఒక్కో బృందం కనీసం 24 గంటలపాటు జిల్లాలోనే ఉండాల్సి ఉంటుందని సీఎం చెప్పారు. బృందానికి నాయకత్వం వహిస్తున్న సీనియర్ మంత్రులు కనీసం రెండు జిల్లాల్లో పర్యటించాలని, ఇతర మంత్రులు ఒక్కో జిల్లాకు బాధ్యతలు చేపట్టాలని సూచించారు. ప్రతి బృందం డివిజనల్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలి, ప్రతి డివిజన్ పరిధిలోని జిల్లాలతో వర్చువల్గా అనుసంధానం చేయాలన్నారు. ఈ పర్యటనల సందర్భంగా మంత్రులు స్థానిక శాసనసభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సభ్యులతో మమేకమై వారి సూచనలను వినాలని, వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని ఆయన ఆదేశించారు.
సామాన్యులతో ప్రత్యక్ష సంభాషణ కోసం ‘జన్ చౌపాల్’ నిర్వహించాలని, అలాగే బ్లాక్లు, తహసీల్లలో అభివృద్ధి పనులపై సర్ప్రైజ్ తనికీ నిర్వహించాలని ఆదిత్యనాథ్ సూచించారు. మొత్తం 18 బృందాలు తమ నివేదికను సీఎం కార్యాలయానికి అందజేయాలని, కేబినెట్లో చర్చించి వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. “పీఎం మార్గదర్శకత్వంలో గత ఐదేళ్లలో యూపీ మంచి ప్రభుత్వ నమూనాను అందించింది. ఇప్పుడు మన పోటీ మనతోనే ఉంది, మనం అభివృద్ధి కోసం ప్రయత్నించాలి” అని ఆదిత్యనాథ్ అన్నారు.