ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాబోయే 100 రోజుల్లో 10,000 మంది పోలీసులను నియమించనుంది. ఈమేరకు రిక్రూట్ మెంట్ కు సన్నద్ధం కావాలని సీఎం యోగీ అధికారులను ఆదేశించారు. నేరాలను అదుపు చేసే ప్రయత్నాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన యోగి, నేరాల నియంత్రించడంలో సాధించిన విజయగాథలు చెప్పేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని సూచించారు. సీనియర్ పోలీస్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించిన యోగీ… నేరస్థులపై వేగంగా, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేరస్తులు, అవినీతిపరులపై ప్రభుత్వ జీరో టాలరెన్స్ విధానం ప్రకారం పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని.. జిల్లాల్లో, పోలీస్స్టేషన్ స్థాయిలోని టాప్ 10 నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్, ఎస్టీఎఫ్ తోపాటు ఎస్ఓజి మధ్య మెరుగైన సమన్వయం కోసం ముఖ్యమంత్రి సూచించారు. అదే విధంగా 3 మహిళా PAC బెటాలియన్ల ఏర్పాటుకు అవసరమైన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.