మహారాష్ట్ర ఎంపీ నవనీత్ రాణా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ ఎస్. సోమనాథ్లకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాయుధ దళాల “వీఐపీ” భద్రతను కల్పించింది. భద్రతాపరమైన ముప్పు దృష్ట్యా వారికి పారామిలటరీ కమెండోల భద్రతను అందించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణాకు ‘Y’ కేటగిరీ భద్రతను కల్పించామని, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)కి చెందిన ముగ్గురి నుంచి నలుగురు సాయుధ కమాండోలు ఆమెకు రక్షణ కల్పిస్తారని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 23న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసం వెలుపల ‘హనుమాన్ చాలీసా’ పారాయణం ప్లే చేస్తామని ఆమె ప్రకటించారు.అయితే శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని ముంబై పోలీసులు ఎంపీకి, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాకు నోటీసులు జారీ చేశారు.
ఇక ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్నాథ్కు ‘Y+’ కేటగిరీ భద్రత కల్పించారు. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా, ఆయన వెంట నాలుగు నుంచి ఆరుగురు సాయుధ కమెండోలు 24 గంటలూ ఉంటారని అధికారులు తెలిపారు. వారి భద్రత బాధ్యతను సీఐఎస్ఎఫ్కు అప్పగించారు.
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV), జియోస్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) లేదా GSLV Mk III అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సోమనాథ్ను ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఇస్రో చీఫ్గా నియమించింది. ఇంతకు ముందు ఆయన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్గా ఉన్నారు.