అవినీతి అధికారుల ఆస్తులను జప్తు చేయాలని మద్రాస్ హైకోర్ట్ తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. సాధ్యాసాధ్యాలపై అభిప్రాయాలు తెలపాలంటూ ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చేనెల ఏడోతేదీకి వాయిదా వేసింది. కాంచీపురం జిల్లా శివన్ తాంగల్ కు వీఏఓ రాజేంద్రన్ శ్రీపెరంబుదూరులో 2 వేల చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేశాడు. దాని విలువ 11.50 కోట్లు. అయితే దాన్ని 10 లక్షల రూపాయలకే కొనుగోలు చేసినట్టు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ రద్దు చేయాలని కోరుతూ 2010లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ స్థలం కొనుగోలు చేసిన తర్వాత స్థానిక పోలీసులు, కౌన్సిలర్, న్యాయవాది తమదగ్గర డబ్బులు డిమాండ్ చేశారని..ఇవ్వకపోవడం వల్లనే తనపై కేసు పెట్టారని కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణ సందర్భంగానే న్యాయస్థానం కీలకవ్యాఖ్యలు చేసింది. తప్పు చేసిన అధికారులకు భయం ఉండాలని, కఠిన చర్యలు తీసుకుంటేనే మరొకరు భయపడతారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అందులో భాగంగా అవినితికి పాల్పడేఅధికారుల ఆస్తులను జప్తు చేసే విధానాన్ని తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.