హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ ను లార్జర్ బెంచ్ కు బదలాయించింది కర్నాటక హైకోర్టు. ఈ పిటిషన్లపై విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగిస్తున్నట్లు సింగిల్ జడ్జి బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్ తన ఆదేశాల్లో తెలిపారు. తుది తీర్పు వచ్చే వరకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషనర్లకు ఉపశమనం లభించలేదు. విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్ను ధరించేందుకు అనుమతి ఇవ్వడానికి తాత్కాలిక ఆదేశాలను జారీ చేయడంపై కూడా విస్తృత ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇక బెంగళూరు నగరంలో పాఠశాలలు, కళాశాలల వద్ద నిరసనలు, ప్రదర్శనలను రెండు వారాల పాటు నిషేధిస్తూ కర్ణాటక పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. విద్యాసంస్థల గేట్ల నుంచి 200 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రదర్శనలు నిర్వహించరాదని..ఈ ఆదేశాలు రెండువారాల పాటు అమలవుతాయని తెలిపారు.
అటు హిజాబ్ వివాదంపై కమల్ హాసన్ స్పందించారు. కర్ణాటకలో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని … విద్యార్థుల మధ్య మతపరమైన విభనను సృష్టించే కుట్ర జరుగుతోందని ట్వీట్ చేశారు. పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు తమిళనాడుకు పాకకుండా చూసుకోవాలన్నారు. తమిళనాడు ప్రగతి కోరుకునే ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు కమల్.