ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ ఛాలక్ డాక్టర్ మోహన్ జీ భాగవత్ అభిప్రాయ పడ్డారు. ఈ దిశగా భారతీయ యువత చేస్తున్న కృషి ప్రశంసనీయం అని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో విద్యాభారతి నిర్వహిస్తున్న ఐదు రోజుల కార్యశాల ఉద్ఘాటన కార్యక్రమంలో మోహన్ భాగవత్ మార్గనిర్దేశనం చేశారు. విద్యా భారతి తమ సైద్ధాంతిక భూమిక ప్రకారం విద్యా బోధను చేస్తోందని, విద్య అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, విద్యార్థుల జీవితాల్లో విలవలు కూడా నింపుతోందన్నారు. సమాజంలో పరివర్తన రావాలంటే మొట్ట మొదట వ్యక్తిలో పరివర్తన రావాలన్నారు. ఈ దిశగా విద్యాభారతి పాత్ర ఎంతో కీలమైందని, వ్యక్తి నిర్మాణం, వ్యక్తి స్వభావాన్ని నిర్మించేందుకు దోహదపడే ఇలాంటి విద్యా వ్యవస్థను అందరమూ మరింత అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
చదువు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా విశాల దృక్పథంతో చూడాలని, మానవాళికి సరైన దిశానిర్దేశం చేయడానికి ఉపయోగపడాలన్నారు. తాము చేస్తున్న పనిని సమాజంలోని ప్రతి వర్గం దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా వుందని నొక్కి చెప్పారు. ప్రపంచానికి మార్పు అనే గుణం సహజంగానే వుందని, అందుకే మార్పు అవసరం అని అన్నారు. అయితే.. మార్పు ఏ దిశలో ఎలా జరగాలన్నదే చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఈ మార్పు సానుకూలంగా వుండేలా చూసుకోవాలన్నారు.
అదేవిధంగా అందరిలో వున్న ఆత్మ వస్తువు గురించి కూడా విశదీకరించి చెప్పారు. ‘‘నేను అందరిలో వున్నాను. అందరూ నాలో వున్నారు. ప్రతి వ్యక్తి తాను సమాజంలో అంతర్భాగమని అనుకోవాలి. అలాగే సమాజం కూడా దానిలో భాగమే అని అర్థం చేసుకోవాలి. ఇది భారతీయ తత్వశాస్త్ర ప్రాథమిక ఆలోచన. ఈ ధృక్కోణం నుంచే మన చర్యలు వుండాలి’’ అని సరసంఘచాలక్ పేర్కొన్నారు.
నేడు ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తోందని భాగవత్ పునరుద్ఘాటించారు. భారత్ ఎల్లప్పుడూ సత్య మార్గాన్ని అనుసరించడం ద్వారా తన విలువల ఆధారంగా ప్రయాణం చేస్తోందని, నేటికీ అలాగే తన ప్రయాణాన్ని కొనసాగిస్తోందని శ్లాఘించారు. సమాజంలో పరివర్తన రావాలంటే మొట్ట మొదట వ్యక్తిలో పరివర్తన రావాలన్నారు. ఈ దిశగా విద్యాభారతి పాత్ర ఎంతో కీలమైందని, వ్యక్తి నిర్మాణం, వ్యక్తి స్వభావాన్ని నిర్మించేందుకు దోహదపడే ఇలాంటి విద్యా వ్యవస్థను అందరమూ మరింత అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన ప్రయత్నాలు కేవలం ఓ వర్గం లేదా సమూహ సంక్షేమానికి మాత్రమే పరిమితం కావొద్దని, యావత్ సమాజ సంక్షేమమే లక్ష్యంగా వుండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న పూర్ణ కాలిక కార్యకర్తలు పాల్గొన్నారు.