రాగల కాలంలో భారత్ నుంచి మరింత పెద్ద సంఖ్యలో ప్రపంచ స్థాయి నాయకులు తయారు అవుతారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిలషించారు. రాజకీయాలు , పరిపాలన మాత్రమే కాకుండా సైన్స్, టెక్నాలజీ, విద్య, వైద్యం, సాంకేతికత వంటి రంగాలలో సైతం నాయకులు ముందుకు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. డిల్లీలోని భారత మండపంలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ (సోల్) సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రపంచ సమస్యలు, అవసరాలను తీర్చే మేధస్సు కలిగిన నాయకులు తయారు కావాలని పేర్కొన్నారు.
ఒకప్పుడు మహారాష్ట్ర నుంచి విడిపోయిన గుజరాత్ ఎలాంటి వనరులు లేకుండా ఎలా అభివృద్ధి చెందుతుందని అనే ఆందోళన వ్యక్తమైందని మోదీ గుర్తుచేశారు. గుజరాత్లో బొగ్గు లేదు, కీలకమైన సహజవనరులు లేవు, నీళ్లు లేవు, కేవలం ఎడారి, పాకిస్థాన్ సరిహద్దు అని చెప్పేవారని గుర్తు చేశారు. అయితే ఆ రాష్ట్రంలో ఉన్న నాయకుల కారణంగా గుజరాత్ మంచి అభివృద్ధి సాధించిందని, ఎకనామిక్ పవర్హౌస్గా నిలిచిందని స్పష్టం చేశారు.
గుజరాత్ ను ఒక రోల్ మోడల్ గా మోదీ అభివర్ణించారు. భారత్ ప్రపంచ శక్తి కేంద్రంగా అవతరిస్తోందని మోదీ చెప్పారు. ఈ ఒరవడిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే శక్తిసామర్థ్యాలను నాయకులు అలవర్చుకోవాలని సూచించారు. ఈ మేరకు నాయకులను తయారుచేసే విషయంలో ‘సోల్’ గేమ్ఛేంజర్గా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు. వికసిత్ భారత్ (అభివృద్ధి భారతం) ప్రయాణంలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ ఇన్స్టిట్యూషన్ ప్రారంభించడం ఒక ల్యాండ్మార్క్ అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లోనే నాయకత్వం అవసరం ఉందని మోదీ చెప్పారు. యువ నేతలతోనే భారత్ లో మార్పు సాధ్యమని స్వామి వివేకానంద చెప్పిన మాటలను ప్రధాని గుర్తు చేశారు. వందమంది శక్తివంతులైన యువతీయువకులను తనకు ఇస్తే భారత్ ను మార్చి చూపిస్తానని ఆయన చెప్పేవారని, సరైన నాయకులతో భారత్ కేవలం స్వాతంత్య్రం పొందడమే కాకుండా గ్లోబల్ లీడర్గా కూడా నిలుస్తుందని తాను బలంగా నమ్ముతానని ప్రధాని చెప్పారు.
యువత అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది అని మోదీ వివరించారు. భారత్ ను విశ్వ గురువుగా నిలపడమే తమ లక్ష్యం అని ఆయన వివరించారు