
File Photo
ఏపీలో మూడు రాజధానులపై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఈ మధ్యనే సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి వేదికగా విశాఖే రాజధాని అని.. త్వరలోనే అక్కడ్నుంచే కార్యకలాపాలు సాగుతాయని కీలక ప్రకటన చేసేశారు. ఇప్పటిదాకా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని మాత్రమే జగన్ చెబుతూ వచ్చారు. వైజాగ్కు రాజధాని తరలిపోతుందని మాత్రం తొలిసారి గ్లోబల్ సమ్మిట్ సన్నాహక భేటీలోనే ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో మూడు రాజధానులపై తాజాగా.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనంటూనే… రాజధాని ఏర్పాటు అనేది ప్రజాభిప్రాయం ప్రకారమే జరగాలన్నారు. అమరావతిపై తన అభిప్రాయం ముందే చెప్పానని మరోసారి గుర్తు చేశారు వెంకయ్య. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ప్రధానితో కలిసి శంకుస్థాపనలో పాల్గొన్న విషయాన్ని కూడా గుర్తు చేశారాయన. అంతేకాదు.. అమరావతి అభివృద్ధికి మంత్రిగా నిధులు కూడా మంజూరు చేశానన్నారు.