తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో… బిఆర్ఎస్, బిజెపి మధ్య యుద్ధం ముదురుతోంది. కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని బిఆర్ఎస్ అధినేత కేసిఆర్… ఇప్పటికే తిరుగుబాటు బావుట ఎగరవేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా పోటీ చేసి… బిజెపిని ఓడిస్తామని శపథం చేశారు. మరోవైపు తెలంగాణలో కెసిఆర్ పాలనను అంతం చేస్తామని రాష్ట్ర బిజెపి నేతలు ప్రకటించారు. ఈ మాటల యుద్ధం నడుస్తుండగా…. ఇప్పుడు స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి, కెసిఆర్ పై సమర శంఖం పూరించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన సమావేశంలో… బిఆర్ఎస్ పాలనపై మోడీ నిప్పులు చెరిగారు. ఈ ప్రకంపనలు… రాష్ట్ర రాజకీయాల్ని మరింత వేడెక్కించాయి.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవానికి వచ్చిన మోదీ పర్యటన ఆసక్తికర రాజకీయ పరిణామాలకు దారి తీసింది. ప్రారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బిజెపి బహిరంగ సభ నిర్వహించింది. సభలో పాల్గొన్న ఆయన మోదీ… రాష్ట్రంలో బిఆర్ఎస్ పాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం కేసీఆర్… స్వార్థంతో కుటుంబ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారితో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారసత్వ రాజకీయాలతో తెలంగాణలో అవినీతిని పెంచి పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ ప్రభుత్వం కలసి రావడం లేదని మండిపడ్డారు.
మోదీ హైదరాబాద్ పర్యటనలో… తెలంగాణ ప్రభుత్వ వైఖరిని తప్పు పడతారని బిజెపి శ్రేణులు ముందే ఊహించాయి. కానీ మోదీ ఈ స్థాయిలో యుద్ధం ప్రకటిస్తారని భావించలేదు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని బిఆర్ఎస్ నేతలు పదేపదే విమర్శిస్తున్నారు. ఈ విమర్శలను తిప్పకొడుతూ… మోదీ ప్రసంగించారు. ప్రజాధనాన్ని అవినీతిపరులకు చేరకుండా చర్యలు చేపట్టామని అన్నారు. నేరుగా విద్యార్థులు, రైతులకు లబ్ధి చేకూర్చేలా ఖాతాల్లో నిధులు వేస్తున్నామంటూ బిఆర్ఎస్ వైఖరిని ఎండగట్టారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వేధిస్తోందని టిఆర్ఎస్ నేతలు కొంతకాలంగా మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలను కూడా మోదీ పరోక్షంగా తప్పుపట్టారు. అవినీతిపరులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలా వద్దా అని ప్రశ్నించారు.
మరోవైపు… మోదీ ప్రసంగం పూర్తయిన వెంటనే బిఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. మోదీ ప్రసంగంలో చేసిన విమర్శలను తప్పుపట్టారు. తెలంగాణకు వచ్చిన మోదీ… రాష్ట్ర అభివృద్ధికి ఏదైనా ప్రకటన చేస్తారని… ఊహించామని అన్నారు. కానీ మోదీ ప్రసంగం… తెలంగాణ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిందని వ్యాఖ్యానించారు. కుటుంబ పాలనపై మోదీ మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. బిజెపిలోనే ఎంతో మంది రాజకీయ వారసులకు పదవులు కట్టబెట్టారని ఎద్దేవా చేశారు.
ఇక మోదీ పర్యటనతో… తెలంగాణ బిజెపిలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. టిఆర్ఎస్ విధానాలపై పోరాటం చేస్తున్న కమలం పార్టీ శ్రేణులకు.. మోదీ టూర్ మరింత జోష్ ఇచ్చిందని బిజెపి నేతలు అంటున్నారు. రానున్న రోజుల్లో కెసిఆర్ పై ఉద్యమం ఉధృతం చేస్తామని చెబుతున్నారు. కుటుంబ, నియంతృత్వ, అవినీతి పాలనకు చరమగీతం పాడి, తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ…. మోదీ వ్యాఖ్యల్ని షేర్ చేస్తూ… బిజెపి అభిమానులు, కార్యకర్తలు జోష్ కనబరుస్తున్నారు. మోదీ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు… తెలంగాణ బిజెపికి కొండంత బలం ఇచ్చాయని కమలం పార్టీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తం అవుతోంది.