బెయిల్ మీద విడుదలైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ త్వరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆయన బుధవారమే విడుదలయ్యారు. విడుదలవుతూనే ఏక్నాథ్ షిండే పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
సబర్బన్ గోరేగావ్లో, పట్రా చావల్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి, మనీలాండరింగ్ జరిగినట్లు నమోదైన కేసులో సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఆయన దాదాపు మూడున్నరనెలలు జైలు జీవితం గడిపారు.
జైలు నుంచి విడుదలైన సంజయ్ రౌత్ ముంబైలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. జైలులో గడపటం అంత సులువేమీ కాదని.. కొన్నిసార్లు కొందరు గోడలతోనే మాట్లాడుకుంటారని అన్నారు. సావర్కర్ అన్నేళ్లపాటు జైలు జీవితం ఎలా గడిపారోనని తాను తరచూ అనుకునేవాడినని.. బాలగంగాధర్ తిలక్, అటల్ బిహారీ వాజ్పాయి వంటి నాయకులు జైలులో ఎలా గడిపేవారోనని పదేపదే అనుకునేవాడినని రౌత్ అన్నారు. అయితే తన కుటుంబం దీనినంతటినీ భరించవలసి వచ్చిందన్నారు. తన అరెస్టుకు కారణం రాజకీయ కక్ష సాధింపేననీ ఆరోపించారు.
ఇక తాను తమ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరేను, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లను అలాగే ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కలుస్తానని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కూడా కలవబోతున్నానని తెలిపారు.
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుందని, తాను వాటిని వ్యతిరేకించబోనని రౌత్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నడుపుతున్నారని తాను భావిస్తున్నానని చెప్పారు. ఆయన కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారని, వాటిని తాను స్వాగతిస్తానని చెప్పారు.