మతం మారితేనే పుట్టిన బిడ్డను చూడనిస్తామన్నభార్య, అత్తింటివారిపై ఓ వ్యక్తి కేసు పెట్టిన ఘటన కర్నాటకలో వెలుగుచూసింది. అతని మతపరమైన మనోభావాల్ని దెబ్బతీసేలా వ్యవహరించిన అత్తింటి వారందరిపైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కర్నాటక చిత్రదుర్గ జిల్లా హోస్ పేట సమీపంలోని అరవిందనగర్ బుడగ జంగం కాలనీకి చెందిన మారెప్పకు రెండేళ్ల క్రితం పెళ్లైంది. ఇటీవలే తనకు బిడ్డ జన్మించాడు. ఈ క్రమంలో పుట్టిన బిడ్డను చూసేందుకు వెళ్లిన అతన్ని భార్య, ఆమె తరపు బంధువులు అడ్డుకున్నారు. క్రైస్తవ మతంలోకి మారితేనే బిడ్డను చూడనిస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. ఎంత బతిమాలినా భార్యాబిడ్డల్ని చూసేందుకు అనుమతించలేదు పైగా తనపై దాడి చేశారని వాపోతూ… మారెప్ప హోసదుర్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
మామ వసంత కుమార్, తాత రామచంద్రప్ప, బంధువులు సుధాకర్, మంజునాథ్, సంకప్పపై ఫిర్యాదు చేశారు. ఈ మధ్యనే కర్నాటక ప్రభుత్వం కొన్ని సవరణలతో మతమార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ స్థానిక ఎమ్మెల్యే శేఖర్ ఈ ప్రాంతంలో మతమార్పిళ్ల అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. స్వయంగా తన తల్లిని బలవంతంగా మతం మార్చారంటూ కన్నీరుపెట్టుకున్నంత పనిచేశారు.
అలాంటి ఫిర్యాదే ఇప్పుడు మారెప్ప చేస్తున్నాడు. పెళ్లైన కొంతకాలానికి బలవంతంగా హోలీ వాటర్ అంటూ స్నానం చేయించి తాను క్రైస్తవంలోకి మారానని చెప్పారని… బలవంతంగా తనింట్లోని హిందూ దేవీ దేవుళ్ల చిత్రపటాలను కాలబెట్టారని వాపోయాడు మారెప్ప. తాను చిన్నతనం నుంచీ ఆరాధించే సుంకలమ్మ, మారమ్మ, దుర్గమ్మలు దుర్మార్గులని వాళ్లని పూజించడం కన్నా ఏసును ప్రార్థిస్తే మంచిదని తనను బలవంతపెట్టారని అన్నారు. నిండుగర్భిణి అయిన తన భార్య సరళ డిసెంబర్ 2న పుట్టింటికి వెళ్లిందని.. బిడ్డ పుట్టిన విషయం తెలిసి వెళ్తే తనను అవమానించారని.. మతం మారాలని ఒత్తిడి చేశారని…తాను పూజించే దేవుళ్లను తిట్టారంటూ ఆమె సోదరులైన దొడ్డ హుసేని, సానా హుసేని, కార్తీక్, చంద్రుల మీద కూడా మారెప్ప కేసు పెట్టారు. తన భార్య బిడ్డలను తనతో పంపించేలా చర్యలు తీసుకోవాలంటూ బుడగజంగం జాగృత సమితి పెద్దల దృష్టికీ విషయం తీసుకెళ్లాడు మారెప్ప. స్థానిక ఎమ్మెల్యే గూలిహెట్టి శేఖర్ నూ కలిసి న్యాయం చేయాలని కోరాడు బాధితుడు.