కర్నాటక అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. అన్నిపార్టీలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టగా ఇక మరింత దూకుడు పెంచనున్నాయి.. ఈసారి కూడా ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంటే ..కాంగ్రెస్ ఈసారి కన్నడిగుల మీద భారీ ఆశలే పెట్టుకుంది. అటు జేడీఎస్ సైతం అధికారం చేజిక్కించుకోవాలనే కసితో పనిచేస్తోంది.మరి కొత్తగా జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ సంగతేంటనే ప్రశ్న వినిపిస్తోంది. ఇటీవలి 3 ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీచేయలేదు.ఈసారి కర్నాటకలో పోటీ చేసే అవకాశాలు కూడా కనిపించడం లేదు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తామన్న జేడీఎస్ ఆ మాటే ఎత్తడం లేదు.
భారత్ రాష్ట్ర సమితిగా మారిన తర్వాత కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. జేడీఎస్ తో జట్టు కట్టి కన్నడనాట బరిలో దిగడం ఖాయమని ఘనంగా చెప్పారు. అయితే పార్టీ అక్కడ పనిచేస్తున్నట్టు కనిపించడం లేదు.కర్నాటక ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించినా ..ఎక్కువగా మహారాష్ట్రపైనే గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. గతంలో ఓ సారి..ఈమధ్యే మరోసారి నాందేడ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వీటన్నింటిని బట్టి చూస్తే అసలు కేసీఆర్ పార్టీ కర్నాటక ఎన్నికల్లో పోటీకి దూరం ఉంటుందేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అటు బీఆర్ఎస్ ఆవిర్భావానికి అతిథిగా హాజరైన జేడీఎస్ చీఫ్ కుమారస్వామి కూడా కేసీఆర్ తో టచ్ లో ఉన్నట్టు కనిపించడం లేదు. తెలుగు వాళ్లు పెద్దసంఖ్యలో ఉన్నప్రాంతాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని..మిగతా చోట్ల జేడీఎస్ కు మద్దతిస్తామని నాడు కేసీఆర్ చెప్పారు.అప్పట్లో కేసీఆర్ నుంచి పిలుపు రావడమే ఆలస్యం అన్నట్టు వాలిపోయే కుమారస్వామి ఇప్పుడెందుకో అంతగా ఆసక్తి చూపడం లేదు. అసలు తెలుగు ప్రజలు ఉన్నచోట్ల ఆ పార్టీ సపోర్ట్ తీసుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేయడం లేదు. కారణం అక్కడున్న తెలుగువాళ్లు బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను ఆదరించేందుకు ఆసక్తి చూపకపోవడమేనంటున్నారు. అంతేకాదు కర్నాటకలోకి బీఆర్ఎస్ ఎంట్రీని జేడీఎస్ ఒప్పుకోవడం లేదట.
అసలైతే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశమే ఉంటే… బీఆర్ఎస్ ఎప్పుడో పని ప్రారంభించాల్సి ఉండేది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టాల్సి ఉండె. కానీ ఆ దిశగా ప్రయత్నాలే లేవు. అక్కడ పోటీ చేయడం ద్వారా కన్నడ ప్రజలకు ఏం చేస్తామనే విషయంపైనా ఇంతవరకు ఆ పార్టీనుంచి ఒక్క ప్రకటనా రాలేదు. అయితే షెడ్యూల్ విడుదలైంది ఇవాళే కనుక ఇక దూకుడు పెంచవచ్చని…త్వరలోనే పార్టీ ఈమేరకు ప్రకటన చేయవచ్చనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది.