అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ పై చర్య తీసుకున్నట్టు, హిందూ దేవతపై అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రచురించిన అకౌంట్పై స్వచ్ఛందంగా ఎందుకు చర్య తీసుకోలేదని మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ను ఢిల్లీ హైకోర్టు సోమవారం ప్రశ్నించింది. ఇతర ప్రాంతాల, మతాల ప్రజల మనోభావాల గురించి ట్విట్టర్ పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించింది.
ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ, న్యాయమూర్తి నవీన్ చావ్లాతో కూడిన ధర్మాసనం కాళీ మాతపై AtheistRepublic అనే అకౌంట్ ద్వారా పెట్టిన పోస్ట్లపై పిటిషన్ను విచారిస్తోంది. ట్విట్టర్ లో కొంతమంది వ్యక్తులను బ్లాక్ చేసిన సందర్భాలు ఉన్నాయని, హిందూ మతం కాకుండా మరొక మతానికి సంబంధించి ఇలాంటి సంఘటన జరిగితే, ట్విట్టర్ మరింత జాగ్రత్తగా ఉండేదని వ్యాఖ్యానించింది.
LiveLaw నివేదిక ప్రకారం, వినియోగదారులు ప్లాట్ఫారమ్లో అన్ని రకాల కంటెంట్ను పోస్ట్ చేశారని.. కోర్టు ప్రమేయం లేనపుడు వారి అన్ని ఖాతాలను బ్లాక్ చేయలేయమని US ఆధారిత కంపెనీ చెప్పినప్పుడు, బదులిస్తూ “ఇది లాజికల్ సమాధానమైతే, మీరు ట్రంప్ను ఎందుకు అడ్డుకున్నారు?” అని కోర్టు ప్రశ్నించింది.
“అంతిమంగా మీరు సెన్సిటివ్గా భావించే వ్యక్తులు… కంటెంట్ ను మీరు బ్లాక్ చేస్తారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోని ఇతర వ్యక్తుల మనోభావాల గురించి, మతాల గురించి మీరు బాధపడటం లేదు. అదే హిందు మతం కాకుండా వేరే మతానికి సంబంధించి ఇలాంటివి జరిగితే మీరు మరింత జాగ్రత్తగా, మరింత సున్నితంగా వ్యవహరిస్తారని తేలింది.” అని ధర్మాసనం పేర్కొంది. అకౌంట్లను బ్లాక్ చేయలేమనే ట్విటర్ స్టాండ్ “పూర్తిగా సరైనది కాదు” అని కోర్టు తెలిపింది.
ట్విటర్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ, ప్రస్తుత కేసులో అభ్యంతరకర అంశాలను తొలగించామని, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని తెలిపారు. ఫిర్యాదులు అందినా కూడా ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేసే ప్రక్రియ ఇంకా మిగిలి ఉందని ప్రభుత్వ న్యాయవాది హరీష్ వైద్యనాథన్ తెలిపారు.
ప్రస్తుత కేసులో కంటెంట్ను పరిశీలించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం ఖాతాను బ్లాక్ చేయడానికి చర్య తీసుకోవాలా లేదా అని నిర్ణయించాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. పిటిషనర్కు తమ ప్రతిస్పందనలను దాఖలు చేయాలని కోర్టు ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వం సహా AtheistRepublic లను ఆదేశించింది. ఇలాంటి అవమానకరమైన విషయాలను పోస్ట్ చేయబోమని ట్విట్టర్ యూజర్ నుంచి వాంగ్మూలాన్ని తీసుకుంది కోర్టు. కోర్టు AtheistRepublic ని అఫిడవిట్లో దాని స్టేటస్, లొకేషన్, దాని వ్యాపార స్థలం , అలాగే భారతదేశంలోని ప్రతినిధికి సంబంధించిన వివరాలను నమోదు చేయమని కోరింది. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 6న జరగనుంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)