“రాజకీయం రాయిలా జీవం లేనిది. కానీ రాయి పువ్వును నాశనం చేస్తుంది .ఎందుకంటే పుష్పానికి ప్రతిఘటించడం చేతకాదు.”…. అన్నాడొక మహాత్ముడు… తెలుగునాట ఎన్ని మాటలు తిట్టినా పట్టించుకోని ఏకైక సజ్జన సంస్కృతి కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. సాక్షాత్తు ప్రధానిని ఏళ్లతరబడి బూతులు తిడుతున్నా… చిరునవ్వు దరహాసాలతో సమాధానం చెప్పే నాయకులు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ… అందుకే మోదీని తిడితే గాని ప్రతి వాడి నోటి దూల తీరడం లేదు.ఇది ఒక వికృత ఆనందం. ఒకడు మహాగొప్పగా దూసుకెళ్తుంటే… మనకే సంబంధం లేకున్నా ,లోపల ఉక్కపోతతో ఆయాస పడిపోతూ ఉంటాం. మొన్న ఉగాది నాడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు హనుమంతుడు మా వాడు అని ఓ పరిశోధన చేయడం.అందుకు ఓ ఉదాహరణ…..
లోపల కలిగే వాంతులను అలా కక్కేస్తాం….
ఇక తెలుగు మీడియా వాంతులు అయితే చెప్పనవసరం లేదు. రోజు నరేంద్రమోడీ మీద వ్యతిరేకంగా వ్యాసాలు రాయడం… టీవీ ల్లో కుండబద్దల సుబ్బారావు, రఫీ, కృష్ణ ఆంజనేయులు, చలసాని శ్రీనివాస్ ,నరసింహారావు, సబ్బం హరి( ఆయన ఈ మధ్యలో పోయాడు )… ఎవడో ఢిల్లీ శాస్త్రి…. కామ్రేడ్ నాగేశ్వర్…. ఇలా అమాం బాపతు సరుకునంతా కూర్చోబెట్టి… వీళ్ళ ప్రైమ్ టైం పుణ్యకాలం పూర్తిచేస్తారు… వీళ్లను ఇంటర్వ్యూ చేసే మహానుభావులు…. అర్నబ్ గోస్వామి ని చంపి పుట్టిన వెంకటకృష్ణ…. ఆంధ్రత్వాన్ని జీర్ణించుకున్న మూర్తి…. చంద్రబాబు సరిగమల సారం తెలుసుకున్న సాంబశివరావు… వగైరా వగైరా..
జర్నలిజంలో విలువలు పాటిస్తాం అని తమకు తామే ఢంకా బజాయించి చెప్పే… ప్రముఖ తెలుగు దినపత్రిక… విదేశాల్లో ప్రచురించిన ఓ వ్యాసాన్ని తమ పత్రికలో ఉటంకించి మరీ ప్రధానిని తిట్టడం అనేది విశేషం . యోగి పై మోడీ పై కార్టూన్లు వేసి మరీ వికృత ఆనందం పొందడం.. మరో పత్రిక అయితే రోజూ సంపాదకుడి సంపాదకీయం టిఫిన్ తో పాటు వారానికోసారి సందర్భం పేరుతో అసందర్భ వ్యాసాలను మోడీకి వ్యతిరేకంగా రాస్తూ.. ఆయన భోజనం చాలదు అన్నట్టుగా రామచంద్ర గుహ …రాజ్ దీప్ సర్దేశాయ్ .. కృష్ణారావు.. వంటి వాళ్లతో తిట్టించడంఅనేది పరిపాటి అయింది. మధ్య మధ్యలో కుల వాదులు… అభ్యుదయ భావాలు గల వాళ్లు స్నాక్స్ లా… మోదీపై అక్షర విషం చిమ్ముతూనే ఉంటారు…. అదొక అక్షర దారిద్ర్యం.
2019 లో తిరుమల కొండ నుంచి వస్తున్న అమిత్ షా పై రాళ్ల దాడి చేసిన బ్యాచ్ ను సమర్థిస్తూ.. ప్రత్యేక హోదా మాటున దాన్ని హక్కుగా ప్రమోట్ చేశారు. ఇటీవల చంద్రబాబు పై తిరుపతిలో… శనగ గింజ అంత రాళ్లు పడితే పాలస్తీనా పై ఇజ్రాయిల్ వేసిన బాంబులకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అంత ఇచ్చారు. నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ బ్యానర్లు బెలూన్లను కట్టిన టిడిపి కి మరొక ద్రావిడ పార్టీ అంటూ ఈ వందిమాగదులు బాకాలు ఊదారు… అమరావతి .. పోలవరం.. రైల్వే జోన్ …కృష్ణపట్నం పోర్టు.. ఇలా నానా అంశాలు ముందు పెట్టుకొని… కేంద్రాన్ని టిడిపి తిడుతూ ఉంటే ఆ అజెండా ను నూటికి నూరు శాతం అమలు చేసిన పత్రికలు .. టీవీ చానల్స్ ను … భారతీయ జనతా పార్టీ ఎప్పుడు క్షమించకూడదు… మొదట్లో సోము వీర్రాజు అధ్యక్షులు అయ్యాక ఆ పని చేశాడు… ఆ తరువాత జరిగిన విశాఖపట్నం గూడుపుఠాని అతని ముందర కాళ్లకు బందం వేశారు. ఇప్పుడు రఘు రామ కృష్ణం రాజు ది ఎటూ తేల్చుకోలేని సందిగ్ధావస్థ లాగా తెలంగాణ .. ఆంధ్ర బీజేపీ నేతలు.. కొట్టు మిట్టాడుతున్నారు. నిజానికి రాజు చత్రపతి శివాజీ కావచ్చుగాక… కానీ అతని లేబరేటరీ అంత పసుపు ద్రావణంతో నిండిపోయింది. దాన్ని వైయస్ జగన్ కనిపెట్టి అతనిపై బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెట్టాడు… కోర్టు లోఅతనికి ఊరట దొరికింది…@అదీ సుప్రీంకోర్టులో…!?
ఈ ప్రహసనాన్ని తెలుగు మీడియా… దేనికోసం వాడుకుంటుందో… ఇప్పుడు బీజేపీ …లో ఎవరైనా వ్యూహకర్తలు ఉంటే కనిపెట్టాలి…. లేక పోతే ఇది లేక లేక వెయ్యేళ్ళ తర్వాత వచ్చిన జాతీయ వాద ప్రభుత్వం గొంతు కూడా పిసుకుతోంది. పశ్చిమబెంగాల్లో హిందువులు దిక్కు దివానం లేకుండా పోతుంటే పట్టించుకోని … మన వ్యవస్థలు ఇంత అర్జెంటుగా … స్పందించడం అంటే పూర్వం ప్రశాంత్ భూషణ్ చెప్పిన వాక్యం గుర్తొస్తుంది… చంద్రబాబుకు.. య.స్థానాల్లో లో ఉన్న పట్టు సామాన్యమైనది కాదు అని…!?
ఈ సంఘటనలన్నింటినీ బేరీజు వేసుకొని పరిశీలన చేస్తే ఏతా వాతా తేలిందేమిటంటే ఏ విధంగానైనా చేసి చంద్రబాబు ను మోదీ కి దగ్గర చేయడం… లేదా కేంద్ర ప్రభుత్వాన్ని విధ్వంసం చేయడం… ఇవే తెలుగు మీడియా లక్ష్యాలు…
మరి ఇంత జరుగుతున్నా తెలుగు నేలలో ఉన్న భాజపా నాయకులకు ఏమీ తెలియదా అన్నది… కోటి డాలర్ల ప్రశ్న..
జగన్ టీవీ ల పై కేసు పెట్టాడని మరీ ముఖ్యంగా ప్రజా గొంతు వినిపించే ఆంధ్రజ్యోతిపై పెట్టాడని కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి వాపోయారు.. మరి వారిది ప్రజా గొంతు అయితే రోజూ ఆ గొంతుతోనే కదా మోదీని తిడుతున్న ది….!?
విష్ణువర్ధన్ రెడ్డి ని స్టూడియోలోనే చెప్పుతో కొట్టించి సారీ కూడా చెప్పకుండా మళ్ళీ బ్లాక్ మెయిల్ వార్తలు రాయిస్తే అంత గొప్ప మౌనమునుల్లా ఆంధ్ర బిజెపి ఎందుకు ఉంది… కొట్టినవాడు గొప్పవాడా ?కొట్టించుకున్న వాడు గొప్పవాడా? కొట్టించిన వాడు గొప్పవాడా…? ఇదే ప్రశ్న…
ఇదంతా చర్చ ఎందుకంటే… రేపు ఇదే తెలుగు మీడియా పైత్యం కేంద్ర ప్రభుత్వానికి గుదిబండ కానుంది…. జాతీయవాద సంస్థలు ఇప్పటికైనా మేల్కొని సొంత మీడియా హౌస్ ను స్థాపించుకోకుంటే “”లేక లేక లోకయ్య పుడితే లోకయ్య కన్ను లొట్ట పోయింది “”అన్న సామెతలా మారనుంది. తెలుగు మీడియా లో ఉన్న జస్టిస్ పార్టీ భావజాలం, వామపక్ష భావజాలం… ఇక్కడి భారతీయ జనతా పార్టీని ,జాతీయ వాద భావాలను ఎదగనివ్వదు… చివరి లైన్ గుర్తుంచుకుంటే మరో ముందడుగు వేయగలుగుతారు..
-భాస్కరయోగి