మరోసారి తన సెక్యులర్ బుద్ధి బయటపెట్టుకున్నారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. సరస్వతీమాత చిత్రం, హిందువుల పూజలు లేకుండానే వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు. ఎవరూ చెప్పనంత వినూత్నంగా విషెస్ చెపుతూ ట్వీట్ చేశారు. కర్నాటక హిజాబ్ ఇష్యూను ప్రస్తావిస్తూ సందర్భంలేని వ్యాఖ్య చేశారు.
హిందూ పండగలప్పుడు చెప్పాలా వద్దా అన్నట్టుంటాయి రాహుల్ గాంధీ శుభాకాంక్షలు. ఎప్పుడూ హిందూ దేవీదేవుళ్ల ఫొటోలు లేకుండా జాగ్రత్తపడతారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలనేమో మరి మరో అడుగుముందుకేసి పూర్తి రాజకీయంతో కూడిన పంచమి ట్వీట్ చేసేశారు.
కర్నాటకలో కొందరు ముస్లిం విద్యార్థుల హిజాబ్ వారి చదువుకు అడ్డంకిగా మారిందంటూ ట్వీట్ చేశారు. మనం భారతదేశపు బిడ్డల భవిష్యత్తును దోచుకుంటున్నాం… మా సరస్వతి అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. వివక్ష చూపదంటూ ట్వీట్ ఉంది. అంటే ఎప్పటిలాగే హిందూ పండగ అయిన వసంత పంచమిని రాజకీయ ప్రయోజనం కోసం అపహాస్యం చేశారు రాహుల్.
కర్నాటకలో హిజాబ్ వివాదం గురించి అందరికీ తెలిసిందే. అక్కడ కాలేజీ, యూనివర్సిటీల నిబంధనలను కొందరు విద్యార్థులు అతిక్రమిస్తున్నారు. హిజాబ్ ధరించవద్దని యాజమాన్యాలు చెప్పినా వినకుండా మొండిపడుతూ హిజాబ్ తో తరగతులకు హాజరవుతున్నారు. హిజాబ్ ధరించి రావడాన్ని నిరసిస్తూ హిందూ విద్యార్థులేమో కాషాయ కండువాలతో కాలేజీకి హాజరయ్యారు. దీంతో నిబంధనలు పాటించని హిందూ, ముస్లిం విద్యార్థులను అనుమతించడం లేదు విద్యాసంస్థలు.
ఆ వివాదం సాగుతుండగానే వచ్చిన వసంత పంచమి పర్వదినాన్ని రాజకీయం చేయచూశారు రాహుల్ గాంధీ. వసంత పంచమికి హిజాబ్ వివాదాన్ని ముడిపెడుతూ రెచ్చగొట్టేలా ట్వీట్ చేశారు. జ్ఞానం ప్రసాదించే దేవతగా సరస్వతీదేవిని హిందువులు కొలుస్తారు. అలాంటిది హిందువులకు శుభాకాంక్షలు చెప్పకుండా అపహాస్యం చేస్తూ ట్వీట్ చేశారాయన.
అసలైతే విద్యాసంస్థల నిర్వహణ మతవిశ్వాసాలకు అతీతంగా సాగాలి దాన్నే సెక్యులరిజం అంటారు. మనది లౌకిక దేశం. అందుకే కర్నాటకలోని కాలేజీల్లో హిజాబ్ పై నిషేధం విధించారు. కానీ రాహుల్ గాంధీ వంటి సెక్యులర్లమని చెప్పుకునే వాళ్లు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మైనార్టీలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక వసంత పంచమి సందర్భంగా మరో ట్వీట్ కూడా చేశారు రాహుల్. ఆవాల పొలంలో ఉన్న రైతు ఫొటోను జత చేశారు. అంటే హిందూ దేవుళ్ల చిత్రపటాల్ని పెట్టడం ఆయనకు సుతరామూ ఇష్టం ఉండదని మరోసారి రుజువైంది. రాహుల్ ఉద్దేశపూర్వకంగానే హిందూ ఐకానోగ్రఫీని వాడకుండా జాగ్రత్తపడుతున్నారు.
ఇప్పుడు మాత్రమే కాదు…ప్రతిసారీ రాహుల్ గాంధీ ట్వీట్లు ఇలాగే ఉంటాయి. ఏ హిందువుల పండగకూ ఆయన హిందూ దేవీదేవుళ్ల చిత్రాలను జతచేయరు. గతేడాది గణేశ్ చతుర్థి సందర్భంగా “గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. అంతకుమించి మరో మాట లేదు. గణేశుడి చిత్రం కూడా లేదు.
కృష్ణాష్టమి సందర్భంగా కూడా అంతే. కృష్ణుడి ఫొటో లేకుండానే కృష్ణాష్టమి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.
గత ఏడాది జూన్లో జగన్నాథ్ యాత్ర సందర్భంగా నాయకులంతా ట్వీట్ల వరద పారిస్తే… రాహుల్ అప్పుడు కూడా సింపుల్ గా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు తప్ప ఒక్క చిత్రం కూడా షేర్ చేయలేదు.
ఇక శివరాత్రి సందర్భంగా శివుడి చిత్రం లేకుండా కైలాస పర్వతం చిత్రాన్ని జతచేశారు. కేవలం పండగల సందర్భంగానే కాదు హిందువుల విశ్వాసాలకు సంబంధించిన చిత్రాలు, చిహ్నాలు వేటినీ ఆయన అంగీరించరు.
టోక్యో పారాలింపిక్స్లో స్వర్ణం గెలిచిన పారా అథ్లెట్ సుమిత్ యాంటిల్ చిత్రాన్ని రాహుల్ షేర్ చేస్తూ… ఆయన ఫొటోను క్రాప్ చేశారు. సుమిత్ మెడలో ఓంకారం గుర్తు లేకుండా ఎడిట్ చేసి జాగ్రత్తపడ్డారు. అప్పుడు చాలా మంది రాహుల్ చేసిన పనిని తప్పుబడుతూ ట్రోల్ చేశారు.
https://twitter.com/Subhaji31346370/status/1432315768830509061?s=20&t=iQbvvKlGYCRyDQNCyBVpxg
కావాలనే రాహుల్ గాంధీ హిందువుల నమ్మకాలకు సంబంధించిన గుర్తుల్ని వదిలేస్తుంటారని నెటిజన్లు ప్రతిసారీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయినా సరే రాహుల్ తన తీరు మార్చుకోరు. హిందూ పండగలను లౌకికీకరించడానికి ఎంతో శ్రమపడే ఆయన ఆయనలాంటి వాళ్లు ఇతర మతాల విశ్వాసాలను మాత్రం ఎంతో బుద్ధిగా గౌరవిస్తారు.