దేవరయాంజల్ భూముల దర్యాప్తుపై అంత తొందరేంటని రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండల పరిధిలోని దేవరయాంజల్ భూముల ఆక్రమణలపై దాఖలైన పిటిషన్ పై శనివారం విచారణ జరిగింది.
ఈ నెల 3న ప్రభుత్వం జారీ చేసిన జీవో 1014ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. అయితే వివాదం ఎప్పటినుంచో ఉంటే…కరోనా వేళ ఇప్పుడు ఈ అంశంపై తొందరేంటని కోర్టు నిలదీసింది.
కరోనా విలయతాండవం చేస్తుంటే నలుగురు ఐఏఎస్ లతో విచారణ జరిపించాలా అని కోర్టు అడిగింది. పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా జీవోలిస్తారా అని ప్రశ్నించింది. మిగిలిన ఆలయాల సంగతేంటనీ అంది.
అయితే కేవలం ప్రాథమిక విచారణ కోసమే కమిటీ ఏర్పాటు చేశామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. కమిటీ నివేదిక ఇచ్చాకే చట్టప్రకారమే చర్యలు ఉంటాయనికోర్టుకు విన్నవించారు.దీనిపై స్పందించిన కోర్టు .. ప్రాథమిక విచారణకైనా నోటీసులు ఇవ్వాల్సిందేనని సూచించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వివరణ తీసుకున్నాకే నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పిటిషనర్ల భూముల్లోకి వెళ్లవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతోకౌంటర్ దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.