సింగపూర్ కు కిలో గంజాయిని అక్రమంగా తరలించిన కేసులో దోషిగా తేలిన భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్యను కోర్టు ఆదేశంతో ఉరితీసింది సింగపూర్ ప్రభుత్వం. తనకు ఉరి తప్పించాలంటూ అతను అనేకసార్లు కోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. వివిధ హక్కుల సంఘాలు, అతని తల్లిదండ్రులు సైతం కోర్టుకు, ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. సింగపూర్ అధ్యక్షుడు హలిమా యాకోబ్ కు లేఖరాశారు. ఐక్యరాజ్యసమితి సహా అనేక దేశాలు కూడా తంగరాజుకు ఉరిశిక్షపై పునరాలోచించాలన్నాయి. బ్రిటిష్ బిలియనీర్ సర్ రిచర్డ్ బ్రాన్సన్ కూడా ఉరిశిక్షను నిలిపివేయాలనీ కోరారు. కానీ ఒక్కసారి తీర్పు ఇచ్చాక ఇక వెనక్కి తగ్గేది లేదన్నట్టు వ్యవహరించింది ఆ దేశం. అనుకున్న సమయానికి తంగరాజును ఉరితీసి, అతని దుస్తులు, చెప్పులు, ఉంగరంతో పాటు అతని డెత్ సర్టిఫికెట్ నూ కుటుంబసభ్యుల చేతుల్లో పెట్టేశారు అధికారులు. చట్టాలకు అనుగుణంగా ఉరిశిక్ష అమలుచేశామన్నారు.
మనుషులను నాశనం చేసే మాదకద్రవ్యాల విషయంలో సింగపూర్ ఎంతో కఠినంగా ఉంటుందనేదానికి తంగరాజు కేసు ఓ ఉదాహరణ. మాదకద్రవ్యాలకు సంబంధించిన చాలా కఠినమైన చట్టాలున్నాయక్కడ. మత్తుమందు సరఫరా చేసేవారికి ఉరిశిక్ష, కొరియర్స్ కైతే జీవితఖైదు విధిస్తారు. సమాజాన్ని రక్షించడం తమ బాధ్యత అని తంగరాజు తరపున వకాల్తా పుచ్చుకున్న అందరికీ ప్రభుత్వ అధికారులు తేల్చిచెప్పారు.
అయితే తంగరాజుకు అన్యాయం జరిగిందని అక్కడి యాక్టివిస్టులు ఆరోపిస్తున్నారు. అతనికి అవసరమైన ఇంటర్ప్రెటర్ యాక్సస్ను కల్పించలేదని, సరైన న్యాయవాది కూడా దొరక్క తంగరాజు తనకు తాను వాదించుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే 2013నాటి ఆ కేసులో గంజాయి డెలివరీ చేసింది తంగరాజేనన్న ప్రాసిక్యూషన్ వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో అతను తప్పించుకోలేకపోయాడు.
తంగరాజుకు ఉరి నేపథ్యంలో భారత్ లో చట్టాలతో పోలుస్తూ పలువురు చర్చిస్తున్నారు. అడ్డంగా దొరికిపోయి కేసులు నమోదై… ఏళ్లకేళ్లు విచారణ తరువాత కూడా నామమాత్రపు శిక్షలతో బయటపడుతున్నారు ఇక్కడ నేరగాళ్లు. అవినీతి విషయంలోనూ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది సింగపూర్. 1965 తర్వాత సొంతంగా అడుగులు వేయడం ప్రారంభించిన సింగపూర్ అభివృద్ధి ముఖ్యకారణం అవినీతి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపడమని చెప్పవచ్చు. దేశపౌరులు ముఖ్యంగా యువతను సరైన దారిలో నడిపేందుకు కఠినమైన చర్యలకు సింగపూర్ ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఏమాత్రం వెనకాడ్డం లేదు.