యూపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన వేళ… రకరకాల అంచనాలు, విశ్లేషణలు. బీజేపీనే తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని, యోగీనే మళ్లీ సీఎం అని సర్వేలు చెబుతున్నాయి. అయితే తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదని… అది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని సీఎం యోగీ అన్నారు. యోగీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కిందటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి మోదీ గోరఖ్ పూర్ నుంచి ఎంపీగా ఉండేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధిక సీట్లు సాధించడంతో యోగీని ముఖ్యమంత్రిని చేసింది పార్టీ.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీచేస్తారు..అయోధ్యనా, మధురనా, లేక సొంత జిల్లా గోరఖ్ పూర్ నుంచా అని మీడియా అడిగిన ప్రశ్నలకు యోగీ సమాధానమిస్తూ పార్టీ ఎక్కడ పోటీచేయమంటే అక్కడకు వెళ్తానని అన్నారు.
ఐదేళ్లలో చేయని పనేంలేదని..ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నిలబెట్టుకున్నామని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల కేటాయింపుపై సమాధానాన్ని యోగీ దాటవేశారు. బీజేపీ పెద్ద కుటుంబమని సమయ సందర్భాలను బట్టి కుటుంబసభ్యుల పాత్ర, విధులు మారుతాయనీ అన్నారు.
గత ఎన్నికల్లో నాటి ప్రభుత్వం వైఫల్యాలను ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్తే…ఇప్పుడు తమ విజయాలను చెప్పుకుంటూ జనం ముందుకు వెళ్తున్నామని ఆయన అన్నారు.