బెంగుళూరు క్రికెట్ విజయోత్సవంలో 11 మంది చనిపోవడం విషాదాన్ని రేపుతోంది. ప్రభుత్వ వ్యవస్థల సమన్వయ లోపంతో ఎంతో భవిష్యత్తు ఉన్న యువత ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమందికి గాయాలు కలిగించిన ఈ సంఘటన ఎన్నో గుణపాఠాలు నేర్పుతోంది. ఈ గందరగోళంలో కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం నెపాన్ని వేరే వాళ్ళ మీద వేసేందుకు విస్తారంగా ప్రయత్నిస్తున్నారు. సిద్దు అత్యుత్సాహమే కొంప ముంచిందంటూ అధికారులు లో లోపల గొణుక్కుంటున్నారు
ఈ సంఘటనలో నాలుగు వ్యవస్థల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ నాయకత్వం, పోలీసులు, ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్. మొదటగా నగర కమిషనర్ తో పాటు కొందరు పొలిసు అధికారులపై వేటు వేయడం, బదిలీ చేయడం ద్వారా వారిపై నెపం రుద్దే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. కానీ, స్పష్టంగా మరుసటి రోజే సంబరాలకు తొందర ఎందుకు, రెండో రోజులు ఆగమని పోలీసులు స్పష్టం చేసిన్నట్లు వెల్లడి అవుతుంది. ముఖ్యంగా విధాన సౌద్ నుండి చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీ జరపవద్దని స్థానిక డిసిపి లిఖితపూర్వకంగా ఆదేశించారు. ఉదయం 10.30 గంటలకే పోలీస్ కమీషనర్ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లిన సందర్భంగా ఆ రోజు సంబరాలు జరిపితే జనాన్ని నియంత్రించడం కష్టం అని స్పష్టం చేశారు. అయితే, సీఎంఓ నుండి ఒక అధికారి, మరో వంక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ల ద్వారా ఆర్సీబీ వత్తిడి తెచ్చిన్నట్లు చెబుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే ఉదయం 7 గంటలకే సంబరాల గురించి, ర్యాలీ గురించి సోషల్ మీడియా ద్వారా ఆర్సీబీ ప్రకటించింది.
ఇక్కడే సమాచార లోపం కనిపిస్తోంది.
ర్యాలీ లేదని 12 గంటలకు ట్రాఫిక్ విభాగం ప్రకటించినా, 1 గంటకు కూడా ఉందంటూ ఆర్సీబీ ప్రచారం చేసింది. వాస్తవానికి అంత తొందరగా మరుసటి రోజే సంబరాలు జరుపుకొవాల్సిన అవసరం లేదు. కప్ గెలుస్తామని ముందుగా అంచనాలు లేకపోవడంతో, సంబరాలకు సన్నాహాలు ముందుగా చేసుకున్న దాఖలాలు లేవు. అనుకోకుండా కప్ రావడంతో భావోద్వేగంతో ఇటువంటి సంబరాలకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నది.
అయితే, ఈ విషయంలో పోలీసులతో కలసి సన్నాహాలు చేసుకొనే ప్రయత్నం చేయాల్సింది. ఆర్సీబీ ఇప్పటివరకు కప్ గెలవలేకపోయినా దేశంలో మరే ఐపీఎల్ టీం కు లేనంతటి క్రెజ్ సంపాదించుకుంది. అందుకు మొదట్లో విజయ మాలవ్య, ఆ తర్వాత సారధులు విరాట్ కోహ్లీ కున్న క్రెజ్ ను ఆసరా చేసుకొని మార్కెటింగ్ చేసుకోవడమే కారణం. అందుకనే ఎప్పుడూ కప్ గెలవలేక పోయినా వ్యాపారపరంగా ముంబై, చెన్నై, కలకత్తాలకు మించి స్పాన్సర్స్ ను సంపాదించి భారీగా ఆదాయం పొందుతున్నారు.
ఇందులో కమర్షియల్ కోణం కూడా దాగి ఉంది. ఆదాయం మీదున్న ఆసక్తి సంబరాల నిర్వహణకు తగు ప్లాన్ చేయడంలో లేకపోవడంతో ఇటువంటి దుర్ఘటన చోటుచేసుకుంది. పైగా, ఈ మధ్య కాలంలోనే కుంభమేళా సందర్భంగా భయంకరమైన తొక్కిసలాట జరిగింది. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో, ఆ తర్వాత హైదరాబాద్ లో పుష్ప-2 విడుదల సందర్భంగా జరగడం చూసాం. అటువంటి అనుభవాల నుండైనా గుణపాఠాన్ని గ్రహించే ప్రయత్నం ఆర్సీబీ, కర్ణాటక ప్రభుత్వం, పోలీసులు చేయలేదు.
పొలిసు అధికారులు చెప్పిన్నట్లు మరో రెండు రోజుల తర్వాత సంబరాలు జరిపితే ప్రశాంతంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, మరుసటి రోజు జరపడంతోనే తొక్కిసలాట జరిగిందని అంటూ తమ బాధ్యతలను నిరాకరించే ప్రయత్నం చేయడం క్షంతవ్యం కాదు. గతంలో అంబరీష్, పునీత్ రాజ్ కుమార్ వంటి నటుల మృతి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున అభిమానులు తోసుకొంటూ వచ్చిన్నప్పటికే ఎటువంటి అవాంఛనీయ ఘటనకు ఆస్కారం లేకుండా చూసిన ఘనత బెంగుళూరు పోలీసులకు ఉందని మరవలేము.
ముందస్తు అంచనా లోపం కూడా కనిపిస్తోంది.
వేడుక జరిగిన చిన్నస్వామి స్టేడియంతో తమకు సంబంధం లేదన్నట్లు పోలీసులు వ్యవహరించారు. దానికి 20 గేట్లు ఉంటె కేవలం మూడు మాత్రమే తెరవడంతొ, ఒక గేటు వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. వెంటనే జోక్యం చేసుకొని, మరొకొన్ని గేట్లను తెరిపించి ఉంటె ప్రమాదం కొంతవరకు అదుపులోకి వచ్చి ఉండెడిది. ఈ విషయంలో క్రికెట్ అసోసియేషన్ సహితం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పాలి.
తొక్కిసలాట దృశ్యాలను చూస్తే నిర్వహణ, భద్రతా వైఫల్యాలు, నిఘా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఘటన తీవ్రత రీత్యా రాష్ట్ర హైకోర్టు సైతం సూమోటోగా స్వీకరించి తక్షణ విచారణ ప్రారంభించి సంధించిన ప్రశ్నలు ఈవెంట్ నిర్వహణలో లోపాలను ప్రాథమికంగా నిర్ధారించేవిగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించైనా నేరుగా సమాధానాలు ఇవ్వకుండా ఇతరులపై నెపం నెట్టివేసి ప్రయత్నాలు కనిపించాయి.
మీడియా సోషల్ మీడియాలలో ప్రజల ఊపు అనేది ముందుగానే వెళ్ళడైంది. కప్ గెలవగానే ఆ రాత్రి అంతా లక్షలాది మంది ప్రజలు బెంగుళూరు వీధులలో సంబరాలు చేస్తూ కనిపించారు. పోలీసులు సహితం వారిని అదుపుచేస్తూ అలసిపోయిన్నట్లున్నది. అందుకనే మరుసటి రోజే విజయ సంబరాలు అంటూ ఆర్సీబీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించగానే ఉదయం నుండే జనం రహదారులపైకి చేరుకోవడం ప్రారంభమైనది.
పైగా, రాత్రి సంబరాలలో తక్కువగా ఉన్న మహిళలు పగలు పెద్ద సంఖ్యలో రావడం, సంబరాల నిర్వహణకు పోలీసులు, ప్రభుత్వంతో పాటు ఆర్సీబీ సహితం ఎటువంటి సన్నాహాలు చేయకపోవడంతో తొక్కిసలాట అనివార్యంగా మారింది. అందుకు అందరూ బాధ్యత వహించాల్సిందే. పోలీసులు కనీసం బారికేడ్లు కూడా ఏర్పాటు చేయకపోవడం, అంబులెన్సులు అందుబాటులో లేకపోవడం వంటివి నేరమయ నిర్లక్ష్యాన్ని వెల్లడి చేస్తున్నాయి.
ఒక వంక స్టేడియంలో సంబరాలు అని ప్రకటించి, మరోవైపు విధాన సౌద్ లో ప్రభుత్వం ప్రత్యేకంగా ఎందుకు సన్మానం చేయాల్సి వచ్చింది? దాని కారణంగా అభిమానులు అంతా పెద్ద సంఖ్యలో క్రీడాకారుల బస్సును వెంబడిస్తూ తిరగడం జరిగింది. సంబరాలు ప్రభుత్వ కార్యక్రమం కాదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేసినా, ప్రభుత్వంలోని పలువురు పెద్దలు హద్దుమీరి ఉత్సాహం చూపడం జరిగింది. అయితే, తగు జాగ్రత్తలు తీసుకోవడంలో అటువంటి ఆసక్తి కనబరచలేదు.
బెంగుళూరు ఘటన లో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఆసుపత్రులకు వెళ్లి పరామర్శలు చేయడమే కాకుండా, సాయంత్రం 7.30 గంటలకల్లా మృతుల జావితాను ప్రకటించారు. తొలుత కొంత గందరగోళం జరిగినా వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు. ఈ విషయంలో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో కీలకమే కాకుండా, పరిస్థితుల తీవ్రంత మరింతగా దిగజారకుండా కాపాడేందుకు దోహదపడుతుంది.
ఈ సందర్భంగా ఐపీఎల్ మొత్తం క్రికెట్ ను ఓ జూదంగా మార్చివేసిందని, కార్పొరేట్ కంపెనీల వ్యాపార ప్రక్రియగా మార్చివేసిందనే విమర్శలు ఈ సందర్భంగా వస్తున్నాయి. అసలైన క్రీడా స్ఫూర్తికి ఆస్కారం లేకుండా చేస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. అసలు క్రికెట్ కు సంబంధం లేనివారు, ఎప్పుడూ క్రికెట్ బ్యాట్ కూడా పట్టుకొని వారు బీసీసీఐలో, ఐపీఎల్ టీం ల నిర్వహణలో కీలకంగా మారి, వారే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందనే ఆందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నాయి.
ఏదేమైనా క్రికెట్ నేడు ఓ కీలకమైన వినోదంగా మారిందని గుర్తించాలి. సినిమా తారలకు మించి కొందరు క్రికెట్ క్రీడాకారుల పట్ల జనంలో క్రెజ్ కనిపిస్తున్నది. క్రికెట్ కారణంగా మిగిలిన ముఖ్యమైన ఆటలకు స్పాన్సర్లు దొరకడం లేదని, ఆయా క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం లభించడం లేదని కొంత అసంతృత్తి ఉన్నప్పటికీ, వందల సంఖ్యలో యువకులు నూతనతరం క్రికెట్ క్రీడాకారులుగా వెలుగులోకి వచ్చేందుకు ఐపీఎల్ దోహదపడుతుందని మరచిపోలేము.
క్రికెట్ క్రీడాకారులు సహితం నేడు భారీ ఆదాయాలు పొందుతున్నారు. పైగా ఐపీఎల్ లో రాణించిన వారు భారత దేశ జట్టులో చేరుతూ ఉండడంతో అంతర్జాతీయంగా భారత జట్టు గతంలో ఏనాడూ లేనివిధంగా విజయాలు సాధిస్తూ వస్తున్నది. కార్పొరేట్ రంగంలోని వారు ఐపీఎల్ ను సహితం ఓ వ్యాపారంగా మార్చివేస్తున్నప్పటికీ యువతకు ఇంతటి పోరుత్సాహం అందించేందుకు దోహదం చేయడాన్ని ఎందుకు నిరాకరించాలి?
ముంబై, చెన్నై జట్లు అనేక పర్యాయాలు ఐపీఎల్ కప్ లు గెలుచుకున్నాయి. వారు కూడా సంబరాలు జరుపుకున్నారు. అయితే అక్కడెక్కడా బెంగుళూరులో మాదిరిగా భావోద్వేగాలు ఇమిడిలేకపోవడం గమనించాలి. ప్రపంచ కప్ గెలిచినా ముంబైలో ఇంతటి భావోద్వేగం ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు. లక్షల సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చినా ఓ సాధారణమైన అంశంగా చాలా ప్రశాంతంగా సంబరాలు జరుపుకోవడాన్ని చూసాము. చివరకు ఆయా జట్ల క్రీడాకారులతో సహితం భావోద్వేగాలు అంతగా కనిపించేవి కావు.
కానీ బెంగుళూరులో ముందుగా క్రీడాకారులు తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. విరాట్ కోహ్లీ అహ్మదాబాద్ స్టేడియంలోని కన్నీటీతో భావోద్వేగానికి గురికావడం ద్వారా మొత్తం కర్ణాటక ప్రజలను భావోద్వేగంతో నింపివేసారు.
ఎందుకంటె, ప్రతిఏడాది `ఈ సారి కప్ మాదే’ అంటూ హడావుడి చేయడం, చివరకు బొక్కబోర్లా పడుతూ రావడంతో ఓ విధమైన నైరాశ్యంలో చిక్కుకున్న ఆర్సీబీ జట్టుకు మాత్రమే కాకుండా మొత్తం కర్ణాటక ప్రజలకు తీవ్రమైన భావోద్వేగమైన అంశంగా మారింది.
కేవలం బెంగళూరు నుండే కాకుండా మొత్తం కర్ణాటక నుండి అభిమానులు పెద్దసంఖ్యలో రావడం, ఆ రీతిలో సన్నాహాలు జరగక పోవడంతో ఇటువంటి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటను ఓ గుణపాఠంగా స్వీకరించి, దేశంలో ఐపీఎల్ జట్లు అన్ని ఇక ముందు జాగ్రత్త వహించాలి. ఓ జట్ట ఫైనల్ కు దగ్గరగా జరిగినప్పుడే కప్ సాధిస్తే సంబరాలు ఏవిధంగా జరపాలో ముందుగా ఓ ప్రణాళిక తయారుచేసుకొని విధంగా చూడాలి.
ఈ ఘటన ద్వారా అనేక వ్యవస్థను పాఠాలు నేర్చుకోవాలి. ప్రజలు కూడా అప్రమత్తతను అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది.