స్వాతంత్రం తరువాత దేశంలో మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ స్థాయిలో జాతీయ హై వేలు నిర్మించడానికి వాజపేయి గారి టైం లో నిర్ణయం తీసుకుని స్వర్ణ చతుర్భుజి పేరు మీద దేశంలో గల నాలుగు ప్రధాన మెట్రో నగరాలు అయిన ఢిల్లీ, ముంబై, కలకత్తా మద్రాస్ నగరాలు కలిపారు.
మిగతా హై వేలు నాలుగు లేన్లు హై వేలుగా నిర్మిస్తే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అని ఢిల్లీ-ముంబై హై వే మాత్రం 6 లేన్లు నిర్మించారు.
కానీ అప్పటికంటే ఇప్పుడు ఆ రూట్ లో ట్రాఫిక్ చాలా ఎక్కువ అయినందువల్ల , మధ్యలో ఉన్న కొన్ని గ్రామాలు, పట్టణాలు ఉండడం వల్ల ట్రాఫిక్ అనుకున్నంత వేగంగా కదలడం లేదు. ఈ హై వేను ఇంకా 8/10/12లేన్లుగా విస్తరించడానికి మధ్యలో జనవాసాలు ఉండడంతో భూసేకరణ పెద్ద సమస్యగా మారడంతో ఈ హైవే ను ఇలాగే ఉంచి వేరే మార్గంలో ఇప్పుడు 8 లేన్లు (అవసరం అయితే 12 లేన్లుగా విస్తరించడానికి అవకాశం ఉంచుతూ) పూర్తి ఆక్సిస్ కంట్రోల్డ్ ఎస్ప్రెస్ వే ని నిర్మించడానికి నిర్ణయించారు.
ఈ ఎస్ప్రెస్ వే పూర్తి అయిన తరువాత ఢిల్లీ-ముంబై మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతం ఉన్న 24 గం.ల నుండి 12గం.లకు తగ్గిపోతుంది
ముంబై- ఢిల్లీ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేను నిర్మించడానికి భూసేకరణ ఖర్చుతో కలసి సుమారు లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఇది ఢిల్లీ-ముంబై మధ్య దూరాన్ని సుమారు 220 కిలోమీటర్లు తగ్గిస్తుంది.. ఈ రహదారిపై వాహనాలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో నడవగలవు.
ఈ ఏస్ప్రెస్ వే ముఖ్య విశేషాలు:
1) ఈ ఎక్స్ప్రెస్వే మొత్తం 1,275 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనిలో మధ్యప్రదేశ్ (370 కిమీ), గుజరాత్ (300 కిమీ), హర్యానా (80 కిమీ), రాజస్థాన్ (380 కిమీ) మహారాష్ట్ర (120 కిమీ) రాష్ట్రాల గుండా వెళుతుంది. దీని ఉత్తర చివర ఢిల్లీలో, దక్షిణ చివర ముంబైలో ఉంటుంది.
2) ఈ ఎస్ప్రెస్ వే రక్షిత అడవుల గుండా వెళుతుంది కాబట్టి ఎక్స్ప్రెస్వేలో జంతువుల ఒక వైపు నుండి ఒకవైపు దాటడానికి 2.5 కి.మీ కంటే ఎక్కువ పొడుగు వుండే 5 ఓవర్పాస్లు ఉంటాయి . ప్రతి 500 మీటర్ల విరామంలో జంతువులు దాటడానికి ఒక మార్గం ఉంచుతారు. అడవుల గుండా వెళ్లే ఈ కారిడార్లో ధ్వని అవరోధంతో గల 8 మీటర్ల సరిహద్దు గోడను నిర్మిస్తారు.
3) ఎక్స్ప్రెస్వేలకు ఇరువైపులా 50 కిలోమీటర్ల వ్యవధిలో రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, వసతి గృహాలు, సౌకర్యవంతమైన దుకాణాలు, ఇంధన కేంద్రాలు, EV ఛార్జింగ్ పాయింట్లు మరియు మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తారు.
4) ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వడోదర(బరోడా)-ముంబై ఎక్స్ప్రెస్వే ఈ కొత్త దిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేలో కలిసిపోతుంది.
5) ఈ ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేకు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ 8 మార్చి 2019 న పునాది రాయి వేశారు. ఎక్స్ప్రెస్ వే 2024 మార్చి నాటికి పూర్తవుతుందని అంచనా
6) ఈ ఎస్ప్రెస్ వే నుండి తిన్నగా అడ్డంకులు లేకుండా ఎయిర్పోర్ట్ కి వెళ్లాడానికి వీలుగా ఈ ఎక్స్ప్రెస్వే 5 కిలోమీటర్ల పొడవైన సొరంగం ద్వారా ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క టి 3 టెర్మినల్కు ప్రత్యక్ష కనెక్టివిటీని కలిగి ఉంటుంది.
ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటికే 60శాతం పనులు పూర్తి అయ్యాయి అని ముందుగా అనుకున్నట్లు 2024 లోగా కాక 2023లోపే పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసాం అని గడ్కరీ చెప్పారు
భవిష్యత్ లో ఈ ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే లో ఇటువైపు ఒక లేన్ అటువైపు ఒక లేన్ ప్రత్యేకంగా విద్యుత్ మీద నడిచే పెద్ద పెద్ద రవాణా వాహనాలకు రిజర్వ్ చేస్తాం అని గడ్కరీ చెప్పారు. అంటే విద్యుత్ మీద రైళ్లు నడవడానికి ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లు వేసినట్లే ఈ రోడ్డుకు కూడా ఓవర్ హెడ్ విద్యుత్ లైన్స్ వేస్తారు.
చాడా శాస్త్రి…