ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించుకున్న వలంటీర్ల చట్టబద్దత ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుల గుర్తింపుకోసం ప్రభుత్వం వాలంటీర్లను నియమించిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్సార్ చేయూత పథకం కింద లబ్దిపొందిన తమను జాబితాను తొలగించారని..రాజకీయ కారణాలే కారణమని పలువురు బాధితులు కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున న్యాయవాది అరుణ్ శౌరి వాదనలు వినిపిస్తూ రాజకీయ కక్షసాధింపులో భాగంగా లబ్దిదారులను అనర్హులుగా చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే లబ్దిదారుల గుర్తింపు, అర్హతను నిర్ణయించే అధికారం వాలంటీర్లకు ఎలా వచ్చిందని కోర్టు ప్రశ్నించింది. ఈ వివరాలతో తమ ఎదుటకు రావాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ సీఈవో ఇంతియాజ్ ను కోర్టు ఆదేశించింది.