గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. హత్యకేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలతో సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఒక బృందానికి అసిస్టెంట్ డీసీపీ సతీష్ చంద్రనాయకత్వం వహిస్తుండగా… రెండో సిట్ లో ప్రయాగరాజ్ కు చెందిన ముగ్గురు పోలీసులు అధికారులున్నారు. వాళ్లు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. అతిక్ కు సంబంధించిన ఓ లెటర్ తన దగ్గరుందని బయటపెట్టారు అతని లాయర్. దాన్ని సుప్రీంకోర్టుకు సమర్పిస్తానన్నారు. అయితే ఆ లెటర్లో ఏముందనేది ఆసక్తిగా మారింది. కొద్దిరోజుల క్రితమే అతిక్ దాన్ని సుప్రీంకోర్టుకు రాసినట్టు తెలుస్తోంది. తనకు ప్రాణాపాయం ఉందని..ఎవరైనా తనను చంపితే దాన్ని సుప్రీంకు అందజేయాలని అతిక్ తనకీ లేఖ అందజేశారని అతని లాయర్ చెప్పారు. అతని కోరిక మేరకు దాన్ని అపెక్స్ కోర్టుకు అందజేస్తానన్నారు.
అతిక్ ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు 22 సెకెన్లలో 14 రౌండ్ల కాల్పులు జరిపారు. అతీక్ అహ్మద్ శరీరంలోకి 9 బుల్లెట్లు దిగాయి. అయితే పోస్టుమార్టం సందర్భంగా 8 బుల్లెట్లను గుర్తించారు. మొదటి బుల్లెట్ తలలోకి దిగగానే అతిక్ కుప్పకూలాడు. అసలు మొదటి బుల్లెట్ కు షాట్ డెడ్ అయ్యాడని అంటున్నారు. అయినా ఆగని దుండగుడు వెంటవెంటనే గుండె, వీపుపై ఎనిమిదిసార్లు బుల్లెట్లు పేల్చాడు. ముఖంలో ఒకటి, వీపులో నాలుగు బుల్లెట్లు గుర్తించారు.
ఇక నిందితులు హత్యకు వాడిన ఆయుధాలు అత్యాధునికమైనవని గుర్తించారు. టర్కీకి చెందిన ‘టిసాస్’ కంపెనీ తయారు చేసిన సెమీ-ఆటోమేటిక్ ఆయుధమైన ‘జిగాన’ గన్ గా నిర్ధారించారు. టర్కీ లో పాలిమర్ ఫ్రేమ్తో తయారైన తొలి గన్ ఇదేనట. అక్కడి సైన్యం, ప్రత్యేక దళాలు, ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలు వాడుతున్న గన్ ధర దాదాపు 6 లక్షలు. పాకిస్తాన్ నుంచి వీటిని అక్రమంగా తెప్పించినట్టు అనుమానిస్తున్నారు. శిక్షణపొందిన నిపుణులు మాత్రమే వాడే ఈ ఆయుధాల్ని సామాన్య యువకులు వాడడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఉగ్రసంస్థలతోనూ అతిక్ కు సంబంధాలున్నాయన్నవార్తల నేపథ్యంలో అతని హత్య వెనక ఆయా శక్తుల కుట్ర ఉందేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇక కాల్పులు జరిపిన దుండగులు జైశ్రీరాం అని నినాదాలు చేయడంపైనా ఎన్నో సందేహాలు. నిందితుల విచారణలో ఇంకా ఎన్నో విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. హై ప్రొఫైల్ కేసు కావడంతో అన్నింటినీ వీడియో రికార్డు చేస్తున్నారు. అతిక్ సోదరుల పోస్టు మార్టం ప్రక్రియనూ పోలీసులు రికార్డు చేశారు.