దేశవ్యాప్తంగా నగరాలు ప్రమాద బోనులోకి వెళ్తున్నాయి పెరిగిపోతున్న కాలుష్యం ప్రజల మీదకు పంజా విసురుతుంది ఈ ఏడాది వేసవికాలం ఎండల్ని చూసిన తర్వాత ఈ విషయం పూర్తిగా అర్థమవుతుంది.
నగరాల్లో జీవనం నరకప్రాయంగా మారుతోంది.
దేశంలోని నగరాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతపై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ), ఐఐటీ భువనేశ్వర్ చేసిన రెండు వేర్వేరు అధ్యయనాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. వెంటనే అప్రమత్తం కాకపోతే భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నాయి.
ఢిల్లీకి చెందిన సీఎస్ఈ దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 2001 జనవరి నుంచి 2024 ఏప్రిల్ వరకు నమోదైన ఉష్ణోగ్రతలు, వాతావరణంపై అధ్యయనం చేసింది.
ప్రస్తుతం వేసవిలో సగటున చెన్నైలో 37.4 డిగ్రీలు, కోల్కతాలో 36.5 డిగ్రీలు, ముంబైలో 34.3 డిగ్రీలు, ఢిల్లీలో 32.2 డిగ్రీలు, హైదరాబాద్లో 29.3 డిగ్రీలు, బెంగళూరులో 26.9 డిగ్రీల సెల్సియస్ హీట్ ఇండెక్స్ నమోదవుతున్నది. పెరుగుతున్న పట్టణీకరణకు, వేడి ఒత్తిడికి మధ్య సంబంధం ఉందని అధ్యయనం గుర్తించింది.
గత రెండు దశాబ్దాలుగా ఈ నగరాల్లో వేగంగా కాంక్రీట్ నిర్మాణాలు జరిగాయని, పచ్చదనం తగ్గిపోయిందని ఫలితంగా వేడి పెరుగుతున్నదని తెలిపింది. గత రెండు దశాబ్దాల్లో చెన్నై బిల్ట్అప్ ఏరియా(నిర్మాణాలు) రెండింతలైంది. ముంబైలో 2003లో 38.4 శాతంగా ఉన్న బిల్ట్అప్ ఏరియా 2023 నాటికి 52.1 శాతానికి చేరుకుంది.
ఇదే సమయంలో పచ్చదనం మాత్రం 35.8 శాతం నుంచి 30.2 శాతానికి తగ్గింది. బెంగళూరులో బిల్ట్అప్ ఏరియా 37.5 శాతం నుంచి ఏకంగా 71.5 శాతానికి పెరిగింది. చెన్నైలో 30.7 శాతం నుంచి 73.5 శాతానికి పెరిగింది. పచ్చదనం 34 శాతం నుంచి 20.3 శాతానికి పడిపోయింది.
సాధారణంగా వర్షాకాలం ప్రారంభానికి ముందు కంటే వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండాలి. కానీ గత పదేండ్లుగా ఈ పరిస్థితి మారిపోతున్నది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలో ఉష్ణ సూచిక వర్షాకాలానికి ముందు కంటే వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుండగా, హైదరాబాద్, బెంగళూరులో మాత్రం కొంత చల్లగానే ఉంటున్నదని సీఎస్ఈ గుర్తించింది.
మొత్తంగా 2001 – 10తో పోలిస్తే గత పదేండ్లలో వర్షాకాలంలో సగటున 1 డిగ్రీ సెల్సియస్, వర్షాకానికి ముందు ప్రీ మాన్సూన్లో 0.5 డిగ్రీల సెల్సియస్ వేడి పెరిగింది. ప్రస్తుతం భారత జనాభాలో 36 శాతం(40 కోట్లు) పట్టణ జనాభా ఉండగా, 2050 నాటికి ఇది రెట్టింపు అవుతుందని, 80 కోట్ల మంది పట్టణాల్లో నివసిస్తారని వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అంచనా వేస్తున్నది.
ఈ నేపథ్యంలో నగరాల్లో వేడిని తగ్గించడానికి నీటి వనరులను, పచ్చదనాన్ని పెంచాలని పేర్కొన్నది. వేడిని ఉత్పత్తి చేస్తున్న కాంక్రీట్ ఉపరితలం, వాహనాలు, పరిశ్రమలు, ఏసీ వంటి వాటి వినియోగం, నిర్వహణలో మార్గదర్శకాలు రూపొందించాలని పేర్కొన్నది. సాధారణంగా ఆరోగ్యపరమైన అత్యవసర చర్యలు తీసుకునేటప్పుడు కేవలం పగటిపూట ఉష్ణోగ్రతలనే పరిగణనలోకి తీసుకుంటున్నారని, రాత్రి ఉష్ణోగ్రతలు, తేమను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
ఇతర మెట్రో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ పరిస్థితి మెరుగ్గా ఉంది. నగరంలో 2003లో 20.6 శాతంగా ఉన్న బిల్ట్అప్ ఏరియా 2023 నాటికి 44 శాతానికి పెరిగింది. 2003లో 8.9 శాతంగా ఉన్న పచ్చదనం 2023నాటికి ఏకంగా 26.5 శాతానికి పెరిగింది. గత పదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టడం, అర్బన్ ఫారెస్టుల అభివృద్ధి వంటి ప్రయత్నాలు ఫలించినట్టు ఈ లెక్కలను బట్టి అర్థమవుతున్నది.
పట్టణీకరణ ఎక్కువవడమే ఈ పరిస్థితికి కారణమని ఐఐటీ భువనేశ్వర్ గుర్తించింది. పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా విస్తరించి ఉండే కాంక్రీట్, తారు పగటిపూట వేడిని గ్రహించి రాత్రిపూట వదులుతున్నదని, ఫలితంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తేల్చింది. మరోవైపు దేశంలోని 140 ప్రధాన నగరాలపై అధ్యయనం చేసిన ఐఐటీ భువనేశ్వర్ పరిశోధకులు.. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లో రాత్రిపూట 60 శాతం ఎక్కువ వేడి ఉంటున్నదని గుర్తించారు.
ఇప్పటికైనా నగర ప్రజలు మేలుకొని మొక్కలు పెంచడం అలవాటు చేసుకోవాలి. కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు ప్రజల స్వచ్ఛందంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే నష్టపోయేది కూడా ప్రజానీకమే అని గుర్తించుకోవాలి.