తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఒక్కొక్కరుగా ఢిల్లీ చేరుతున్నారు. పార్టీ అగ్ర నాయకులని కలుసుకుని ప్రసన్నం చేసుకుంటున్నారు. పోటీలో వెనక పడకూడదు అన్న ఉద్దేశంతో పరుగులు తీస్తున్నారు. ఇంతకీ నాయకులంతా ఢిల్లీ వెళ్లడానికి కారణం ఆసక్తికరంగా నిలుస్తోంది.
మొదటగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సన్నిహిత సహచరులను తీసుకుని ఢిల్లీ వెళ్లారు. పార్టీ అగ్రనాయకత్వం సోనియాగాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లను కలుసుకునే పనిలో పడ్డారు. మరోవైపు ఆయన సన్నిహితులు మల్లు రవి అయోధ్య రెడ్డి తదితరులు కాంగ్రెస్లోని ఇతర నాయకుల్ని విడివిడిగా కలుస్తున్నారు. రేవంత్ రెడ్డి మనసులో మాటని ఆయా నేతలకు చేరవేస్తున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని రేవంత్ భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా తాను ఎంపిక చేసిన పేర్లను అధిష్టానం ముందు ఉంచుతున్నారు. ఈ జాబితాకు ఆమోద ముద్ర వేయించుకోవాలని విస్తారంగా ప్రయత్నిస్తున్నారు.
ఈలోగా రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ సంగతి బయటకు పొక్కింది. దీంతో మంత్రివర్గంలో సీట్ల ఆశిస్తున్న నాయకులు వరుసగా ఢిల్లీకి ప్రయాణం పెట్టుకున్నారు. గతంలో తమకు పరిచయం ఉన్న కాంగ్రెస్ అగ్రనేతల్ని పట్టుకుని తమ పేర్లను సిఫార్సు చేయించుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఐదారు మందిని తీసుకుని అవకాశం ఉంది కాబట్టి ఎలాగైనా మంత్రి స్థానం దక్కించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఇదే అదనుగా సీనియర్ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి వంటి నాయకులు కూడా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. సీనియర్ లాబీ తరఫున కొంతమంది పేర్లను అధిష్టానం దగ్గర ఉంచుతున్నారు. కేవలం రేవంత్ రెడ్డి మాటనే పూర్తిగా అంగీకరించకుండా,, తమ గ్రూపును కూడా పట్టించుకోవాలని విన్నవిస్తున్నారు. దీంతో రెండు మూడు గ్రూపులుగా అధిష్టానం దగ్గర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కానీ రేవంత్ రెడ్డి వర్గం మాటే ఎక్కువగా చెల్లుబాటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమేర నిరాశకర ఫలితాలు వచ్చినప్పటికీ దానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నామని రేవంత్ వర్గం అధిష్టానం దగ్గర చెబుతూ వస్తోంది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పటిష్టమవుతుందని చెబుతున్నారు. ఈ కారణాలతో రేవంత్ వర్గానికి పెద్దపీట వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని పార్టీ లోకి తీసుకోవడం వివాదాస్పదం అవుతుంది. స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డిని సంప్రదించకుండా రేవంత్ రెడ్డి వర్గం నేరుగా చేరికలు పెట్టేసుకోవడం ఇబ్బందిగా మారింది. దీనిమీద జీవన్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. కనీసం మాట మాత్రం కైనా చెప్పకుండా పార్టీలోకి తీసుకోవడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. ఒకానొక దశలో పార్టీ వీడియో ఎందుకు ఆయన సిద్ధపడ్డారు. దీంతో అధిష్టానం ఢిల్లీకి పిలిపించి నచ్చ చెప్పేందుకు ప్రయత్నాలు చేపట్టింది.
మొత్తం మీద చూసుకుంటే జూలై నెలలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెబుతున్నారు. అయితే ప్రస్తుత మంత్రుల్లో ఎవరిని కదిలించే పరిస్థితి ఉండదని స్పష్టం చేస్తున్నారు. అదనంగా కొందరిని చేర్చుకోవడం మాత్రమే జరుగుతుందని చెబుతున్నారు.