శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ని పాత్రాచల్ హౌసింగ్ ₹1000 కోట్ల రూపాయల స్కామ్ తో లింక్ ఉందని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అసలు ఈ వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ ఏమిటో తెలుసుకుందాం.
ఉత్తర ముంబైలో గోరేగాన్ లో గల సిద్ధార్థ నగర్ ఏరియానే పాత్రాచల్ అని అంటారు. ఇక్కడ మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (MHADA) కి 47 ఎకరాలు స్థలం ఉంది. దానిలో 672 ఇళ్లు ఉండి, కుటుంబాలు నివసిస్తున్నాయి.
ఆ పాత్రాచల్ 47 ఎకరాలు అభివృద్ధి చేద్దామని ఉద్దేశ్యంతో 2007 సం.లో MHADA శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ముఖ్య అనుచరుడు అయిన ప్రవీణ్ రౌత్ సహా మరికొందరికి చెందిన “గురు ఆశిష్ నిర్మాణ సంస్థ”తో ఒక త్రైపాక్షిక అంటే MHADA+672 ఇళ్ల సొసైటీ+ నిర్మాణ సంస్థ కలసి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం గురు నిర్మాణ సంస్థ 672 మంది నివాసితులకు కొత్త ఫ్లాట్స్ కట్టి ఇవ్వడానికి, పూర్తి అయిన కొత్త ఫ్లాట్స్ వారు దిగే వరకు నెలవారీ అద్దె ఇవ్వడానికి, 3000 ఫ్లాట్స్ కట్టి MHADA కి ఇవ్వడానికి ఆపైన కట్టే మిగతా నిర్మాణం గురు సంస్థ బయటవారికి అమ్ముకోడానికి నిర్ణయం జరిగింది.
అయితే ఒప్పందానికి విరుద్ధంగా ఈ ప్రవీణ్ రౌత్ గురు నిర్మాణ సంస్థ ఈ 672 మందికి ఫ్లాట్స్ ని, MHADA కి 3000 ఫ్లాట్స్ కానీ కట్టి ఇవ్వకుండా రూల్స్ ప్రకారం ఆ ఏరియా లో తమ నిర్మాణ సంస్థ ఎంత ఫ్లోర్ ఇండెక్స్ రేషియో ప్రకారం నిర్మాణం చేసుకోవచ్చో అంత ఫ్లోర్ ఇండెక్స్ ఏరియా ను ₹1039 కోట్లకు వేరే 9 సంస్థలకు అమ్మేసింది.
ఈ సంగతి ఎలా బయట పడింది?
పాత్రాచల్ లో తమ ఇళ్ళు ఖాళీ చేసి వేరే ఇళ్లలోకి మారిన 672 మంది కుటుంబాలకు 2014 వరకు రెగ్యులర్ గా అద్దెలు పే చేస్తూ ఆ తరువాత అద్దెలు ఇవ్వడం మానేసింది గురు నిర్మాణ సంస్థ. దాంతో మాకు ఒప్పందం ప్రకారం అద్దెలు ఇవ్వడం లేదు, మా ఇళ్ల నిర్మాణం లో జాప్యం జరుగుతోంది అని వీళ్ళు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు.
ఈ ఫిర్యాదుల నేపధ్యంలో గురు నిర్మాణ సంస్థ చేసిన ఫ్రాడ్ బయట పడటంతో MHADA గురు నిర్మాణ సంస్థతో చేసుకున్న ఒప్పందం 2018లో రద్దు చేసుకుంది. దీంతో నష్టపోయిన ఆ 9 నిర్మాణ సంస్థలు హై కౌర్ట్ కి వెళ్లారు. ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయింది.
2020లో ఉద్ధవ్ ప్రభుత్వం ఒక కమిటీ వేసి దాని సూచనలు ప్రకారం ప్రాజెక్టు మొత్తం నిర్మాణం MHADA చేపట్టి 672 మందికి ఫ్లాట్స్ కట్టించి ఇచ్చే బాధ్యత అప్పచెప్పారు.
దీనిలో ఈడీ పాత్ర ఏమిటి?
ఈ స్కామ్ బయటపడ్డాక ఈడీ రంగంలోకి దిగి ప్రభుత్వ రేట్లు ప్రకారం పైన చెప్పిన సొమ్ము మాత్రమే కాక క్యాష్ ద్వారా కూడా పలు వ్యవహారాలు నడిచినట్లు గుర్తించింది. అసలు ఈ ₹1039 కోట్లు సొమ్ము ఏమయిందో ఈడీ ఆరా తీయడం మొదలుపెట్టింది. ఈ సొమ్ములో సుమారు ₹100కోట్లు సంజయ్ రౌత్ ముఖ్య అనుచరుడు అయిన ప్రవీణ్ రౌత్ బాంక్ ఖాతాల్లో 2010 సం. లోనే పడినట్లు, ఆ సొమ్ము కూడా అక్కడ నుంచి వేరే వేరే బంధువులు స్నేహితుల ఖాతాలలోకి తరలించినట్లు కనుక్కుంది. అలా తరలించిన కొంత సొమ్ము సంజయ్ రౌత్ భార్య ఖాతాలోకి జమ అయినట్లు ఆ డబ్బుతో కిహ్లీమ్ బీచ్ వద్ద 8 ఇళ్ల స్థలాలు కొన్నట్లు ఈడీ సంజయ్ రౌత్ ఇంటి మీద చేసిన దాడుల్లో ఆధారాలు సేకరించింది.
ఈడి సేకరించిన ఆధారాలతో వీళ్ళందరి మీద మనీలాండరింగ్ చేసినట్లు ఆరోపిస్తూ PMLA చట్టం క్రింద కేసులు పెట్టి ప్రవీణ్ రౌత్ ని ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే అరెస్ట్ చేసింది. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అతనికి చెందిన సుమారు ₹76 కోట్ల ఆస్తి జప్తు చేసింది. సంజయ్ రౌత్ ని గతవారం అరెస్ట్ చేసి అతనికి చెందిన సుమారు ₹8 కోట్ల ఆస్తి జఫ్తు చేసి విచారణ జరుపుతోంది. సంజయ్ రౌత్ భార్యను కూడా ఈడీ అధికారులు నిన్న విచారణకు పిలిచారు. ఇటువంటి ఈడి దాడులనే చూపిస్తూ మోదీ ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడానికి ఈడీ ని వాడుకుంటున్నాడు అని ప్రతిపక్షాల ఆరోపణ.
కొసమెరుపు:
గతంలో చాలా మంది PACL స్కామ్ గురించి వినే ఉంటారు. భూములు ఇస్తాం అని చెప్పి పెరల్ ఆగ్రో అనే సంస్థ మల్టి లెవెల్ వ్యాపారం ద్వారా సుమారు ఐదున్నర కోట్ల మంది దగ్గర 18 సం. ల పాటు ₹60 వేల కోట్లు వసూలు చేసి బోర్డ్ తిప్పేసింది. దాంట్లో కూడా పైన చెప్పుకున్న ఈ సంజయ్ రౌత్ ముఖ్య అనుచరుడు ప్రవీణ్ రౌత్ పాత్ర ఉంది అని తేలింది. దానిపై కూడా సీబీఐ, ఈడీ విచారణ జరుగుతోంది. ఇప్పటికే 11 మంది జైల్లో వున్నారు.. ఈ స్కామ్ లో కూడా సంజయ్ రౌత్ పాత్ర ఉందా అని ఈడీ విచారిస్తోంది.
~ చాడా శాస్త్రి