ఏం తమాషానా?
తెలంగాణ రాష్ట్ర కల్వకుంట్ల వారి రాజ్యం అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఆఫీసుకు పోని ముఖ్యమంత్రి. హైవేలను బ్లాక్ చేసే ముఖ్యమైన మంత్రి. బాహాటాటంగా కబ్జాలు చేస్తున్నారని ఆరోపణలున్న ఎమ్మెల్యేలు. బాధ్యత లేని ప్రజా ప్రతినిధులు. గాలాబీ కార్యకర్తల్లా మారారని విమర్శలు ఎదుర్కొనే పోలీసులు. అంతా విచిత్రంగా, అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి.
నియంత్రిత సాగుమీద సీఎం యుటర్న్ తీసుకున్నారు. మోడీ ప్రభుత్వం తెచ్చిన చట్టాలమీద భీకరమైన విమర్శలు చేసిన కెసిఆర్, చివరకు పిల్లిలా తోక ముడిచారు. కేంద్రం మీద యుద్ధం అంటూ ఢిల్లీకి వెళ్లి అక్కడి పెద్దలకు దండాలు పెట్టి వచ్చారు. అంతకు ముందు భారత్ బంద్ జిందాబాద్ అన్నారు. కెసిఆర్ మినహా మొత్తం గులాబీ క్యాడర్ ఒక రోజంతా రోడ్ల మీదే ఉంది. మోడీ మీద దుమ్మెత్తి పోసింది. రాస్తారోకో చేసి వాహనాలను అడ్డుకుంది. ప్రభుత్వం అధికారికంగా ఆర్టీసీ బస్సులను బంద్ చేయించింది. అది మరీ దారుణం. ప్రజలకున్న పౌర హక్కులను కర్కశంగా కాలరాసింది కెసిఆర్ ప్రభుత్వం. ముఖ్యమైన మంత్రి, కల్వకుంట్ల యువరాజు కెటిఆర్ ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో కనిపించని లోటు తీర్చుకున్నట్టున్నారు. హైవేమీద రోజంతా బైఠాయించి రెబల్ హీరో అనిపించుకునే ప్రయత్నం చేసినట్టున్నారు. ఆ ఒక్కరోజు ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. ఆస్పత్రులకు వెళ్లే వారు, అయినవాళ్లు మరణించారని తెలిసి బయల్దేరిన వారు, ఇంకా ఇతర పనులపై ప్రయాణం కట్టిన వాళ్లు నరకయాతన పడ్డారు. ఇదేంటని అడిగిన కొందరిని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కొట్టారని వార్తలు వచ్చాయి.
కేంద్రంపై యుద్ధం చేస్తానంటూ ఢిల్లీకి వెళ్లిన కెసిఆర్ మోడీకి, మంత్రులకు వంగి వంగి దండాలు పెట్టి వచ్చారు. ఢిల్లీ శివార్లలో ఆందోళన పేరుతో జరుగుతున్న హైవే దిగ్బంధం స్థలానికి కెసిఆర్ ఎందుకు పోలేదు అని విపక్షాలు అడిగితే జవాబు ఇవ్వలేదు. ఇప్పుడేమో కేంద్ర చట్టాల ప్రకారం ఎక్కడైనా ధాన్యం అమ్ముకోవచ్చు. రైతులకు స్వేచ్ఛ ఉంది. దాన్ని ఉపయోగించుకోండి అన్నారు కెసిఆర్. మరి ఒక రోజంతా హైవేలను దిగ్బంధించి ప్రజలకు నరకం చూపించినందుకు ఎవరికి ఏ శిక్ష విధించాలి. ఆనాటి ఆ పాపానికి కారకుడు కెసిఆర్ కాదా? పోనీ చట్టాలను వ్యతిరేకించే వైఖరికి కట్టుబడి ఉన్నారా అంటే అదీ లేదు. అలవాటు ప్రకారం యూటర్న్ తీసుకున్నారు. ఏం తమాషానా అంటూ కెసిఆర్ విపక్షాలపై కామెంట్ చేస్తుంటారు. ఇప్పుడు ప్రజలు అదే మాట అంటున్నారు. ఏం తమాషానా? మీరే బస్సులు ఆపేస్తారు. హైవేల బ్లాక్ చేస్తారు. మోడీ చట్టాలను విమర్శిస్తారు. తర్వాత మీరే సమర్థిస్తారు. ఏం తమాషా చేస్తున్నారా అని ప్రశ్నించడం మాత్రమే కాదు. కెసిఆర్ కు, ఆయన పార్టీ నేతలకు తగిన శిక్ష పడాల్సిందే అంటోంది ప్రజానీకం.