అన్ని ధరలూ పెరిగిపోతున్నాయి !
నిజమే ! అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు అంటే గ్లోబలైజేషన్ కి ముందు మనకి ఇన్ని రకాల వస్తువులు అందుబాటులో లేవు. GATT [General Agriment on Trade & Technology ] మీద సంతకం పెట్టాకా అన్ని వస్తువులు మనదేశంలోకి వచ్చేసాయి. నిత్యం మనం వాడే వస్తువులు అన్నీ ఎదో ఒక దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నవే. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో సంక్షోభం తలెత్తినా దాని ప్రభావం చాల దేశాల మీద పడుతున్నది. దాంతో వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి అంటూ బెమ్బెలేత్తుతున్నాం అంటే ఇప్పటి వరకు అవి మన దేశంలోనే తయారవుతున్నాయి అనే భావనలోనే ఉండడం వలన వచ్చిన ఇబ్బంది.
ధరలు పెరగపోతే శ్రీలంక పరిస్థితే మనకూ వస్తుంది!
1.ప్రజల మన్నన పొందడానికి అంటూ శ్రీలంక ప్రభుత్వం ఆదాయపన్ను ని తగ్గించింది ! ఇది మంచి పనేనా ? కానే కాదు ! ఉన్న ఆదాయపన్ను శాతాన్ని తగ్గించడం వలన ప్రభుత్వ ఆదాయం పడిపోయింది !
2. అనవసర ప్రాజెక్ట్ లకోసం బిలియన్ల కొద్దీ డాలర్లు అప్పు చేయడం తీరా ఆ ప్రాజెక్ట్ వల్ల ఆదాయం లేకపోవడం తో అగ్రిమెంట్ ప్రకారం అప్పు సకాలంలో చెల్లించలేకపోతే మొత్తం ప్రాజెక్ట్ చైనా చేతిలోకి వెళ్ళిపోయింది పైగా ఒక్క శ్రీ లంక రూపాయి కూడా టాక్స్ కట్టక్కరలేదు చైనా ! కానీ అప్పు మాత్రం మిగిలిపోయింది.
3. మన దేశం నుండి దిగుమతి చేసుకొని పెట్రోల్, డీజిల్ లని సబ్సిడీ ఇచ్చి మరీ సరఫరా చేస్తూ వచ్చింది ఇన్నాళ్ళు! కానీ సబ్సిడీ మీద ఎంత కాలం ఇవ్వగలదు శ్రీలంక ? మరి ఇప్పటి పరిస్థితి ఏంటి ?
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బారెల్ కి $113 గా ఉన్నప్పుడు ఇలా హఠాత్తుగా ధరలు ఎందుకు పెంచుతున్నాయి చమురు కంపనీలు ? మరి బారెల్ ధర $40 గా ఉన్నప్పుడు ఎందుకు తగ్గించడం లేదు ?
ఒక సారి చమురు కంపనీలు ధరలు ఎలా పెంచుతాయో చూడండి !
STATIC vs Dynamic – స్థిరమయిన vs క్రియాశీలకమయిన పద్ధతి !
క్రూడ్ ఆయిల్ శుద్ధి అయి అది పెట్రోల్ , డీజిల్ గా ఎప్పుడు ఎలా మన దగ్గరోలోని పెట్రోల్ బంక్ లేదా గాస్ స్టేషన్ కి చేరుకుంటుంది ?
1. క్రూడ్ ఆయిల్ ని ఉత్పత్తి చేసే దేశాలలో అది శుద్ధి అయి పెట్రోల్ మరియు డీజిల్ గా మారి పెట్రోల్ బంక్ కి చేరడానికి పట్టే రోజులు 25 రోజుల నుండి 50 రోజులు పడుతుంది.
2. అదే దిగుమతి చేసుకునే దేశాలలో అయితే ? ఉదాహరణకి మన దేశమే తీసుకుందాం . దిగుమతి చేసుకున్నాక అది శుద్ధి అయి పెట్రోల్ బంక్ కి చేరడానికి పట్టే రోజులు మూడు నెలల నుండి 6 నెలలు పడుతుంది. దీనిని డిస్ట్రిబ్యూషన్ డెలివరీ లీడ్ టైం [Distribution Delivery Lead Time (DDLT) అంటారు. షార్ట్ కట్ లో DDLT అంటారు.
మన చమురు కంపనీలు జనవరి నెలలో బ్రెంట్ క్రూడ్ బారెల్ కి $50 గా ఉన్నప్పుడు కొన్నాయి అనుకుందాము. అది మీ కార్ లేదా బైక్ లోకి చేరడానికి పట్టే సమయం షుమారు గా 6 నెలల నుండి 8 నెలలు పడుతుంది. అప్పుడు క్రూడ్ బారెల్ ధర $140 అయిఉంటుంది అనుకుందాము. కానీ చమురు సంస్థలు రెండున్నర రెట్లు ధరలు పెంచవు. నిదానంగా 20% నుండి 40 % వరకు పెంచుకుంటూ పోతాయి. ఇక్కడే చమురు సంస్థలు భవిష్యత్తులో క్రూడ్ ధర ఎంత పెరగవచ్చో అంచనా వేసి ధరలు పెంచుతాయి. అయితే ఒక్కోసారి చమురు సంస్థల అంచనా కంటే ధరలు పెరుగుతూ ఉంటాయి కూడా కానీ ఆ వ్యత్యాసాన్ని పూడ్చుకోవడానికి కొంచెం సమయం తీసుకొని పెంచుతూ పోతాయి.
కానీ మనం ఎప్పుడూ వినే మాట అది చమురు సంస్థలు నష్టాలలో ఉన్నాయని !ఇందులో వాస్తవం ఉంది మరియు కొంచెం అవాస్తవం కూడా ఉంది. లాభాలలో ఉన్నప్పుడు వాటిని వినియోగదారులకి పంచవు ఎందుకంటే అంతర్జాతీయంగా ఎప్పుడు ధర పెరుగుతుందో తెలీదు కనుక ధర పెరిగినప్పుడు వెంటనే ఆ భారాన్ని వినియోగదారుల మీద పడకుండా తమ లాభాలలో నుండి భరిస్తాయి కానీ అది మరీ భరించలేని స్థితి వచ్చినప్పుడు మాత్రం ఒకే నెలలో మూడు నుండి అయిదు సార్లు కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతాయి.
ఇది ఒక చక్రం లాంటిది ! మార్కెట్ లో 80$ పెట్టి బారెల్ క్రూడ్ కొని అది మన దగ్గరికి రావడానికి 6 నెలలు పడుతుంది కానీ అప్పుడు బారెల్ ధర 40$ గా ఉంటుంది కానీ దానిని చూసి తక్కువగా ఉంది కదా ఎందుకు చమురు సంస్థలు ధరలు తగ్గిచ్చట్లేదు అనుకుంటూ ఉంటాము కానీ మనం ప్రస్తుతం వాడుతున్న పెట్రోల్ 6 నెలల క్రితం $80 పెట్టి కొన్నామని మనకి తెలియదు. మన పెట్రోల్ ఉత్పత్తులని డైనమిక్ సిస్టం ప్రకారం ధరలు నిర్ణయిస్తున్నాము అంటే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు మన దగ్గర కూడా పెంచుకుంటూ వెళతాం కానీ శ్రీలంక,బంగ్లాదేశ్ లాంటి దేశాలు స్టాటిక్ సిస్టం ని అమలు చేస్తున్నాయి అంటే అంతర్జాతీయ ధరల పెరుగుదలతో సంబంధం లేకుండా ఒకే విధంగా స్థిరంగా ధరలు ఉంటాయి కానీ సంవత్సరం చివరికి వచ్చే సరికి చమురు సంస్థలు నష్టాలలో ఉంటాయి కానీ వాటికి ఆయా ప్రభుత్వాలే నష్టాలని భరిస్తాయి. ఇప్పుడు శ్రీలంకలో సంక్షోభం రావడానికి అలా సంవత్సరాల తరబడి చమురు సంస్థల నష్టాలని ప్రభుత్వమే భరించడం వలన చివరికి చేతిలో డాలర్లు లేక విల విలలాడుతున్నది. ఇక్కడ ప్రభుత్వాలు భరించేది డాలర్ల రూపంలో అని గుర్తుపెట్టుకోవాలి. అదే స్వదేశంలో కనుక క్రూడ్ ఉత్పత్తి అవుతున్నట్లయితే ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వడం వలన పెద్దగా నష్టం ఉండదు.
మన్మోహన్ సింగ్ హయాం లో పెట్రోల్,డీజిల్ ధరలు పెరగకుండా చూడడానికి గాను ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేసింది అంటే నేరుగా ప్రభుత్వం చమురు సంస్థల నష్టాలని భరించదు కానీ ఆయిల్ బాండ్స్ ద్వారా వసూలు అయ్యే సొమ్ముని చమురు సంస్థలు వాడుకుంటాయి తమ నష్టాలని పూడ్చుకోవడానికి. కానీ కాల పరిమితి తీరిన బాండ్స్ కి వాటిని కొన్న వాళ్లకి వడ్డీ తో సహా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది తరువాతి కాలంలో ! ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే తాత్కాలికంగా చమురు ధరలు పెరగకుండా చూడడానికి బాండ్స్ ద్వారా నిధులు సేకరించి వాటిని వాడుకొని ప్రస్తుతానికి ధరలు పెరగకుండా చూడడం కానీ తీసుకున్న డబ్బుకి వడ్డీతో సహా చెల్లించాలి కదా ? మన్మోహన్ సింగ్ 2005 -2010 వరకు అంటే 5 సంవత్సరాలు ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేస్తూ పోయాడు. వాటి కాల పరిమితి ఎప్పుడు తీరి తిరిగి చెల్లించాలి ? ఎంత చెల్లించాలి ?
పోయిన సంవత్సరం మార్చి 31 నాటికి ఆయిల్ బాండ్స్ ద్వారా సేకరించిన మొత్తానికి వడ్డీ ఎంత కట్టాలో అసలు ఎంత కట్టాలో ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు. అసలు మొత్తం వచ్చి 1లక్షా 30 వేల కోట్ల రూపాయలు దానికి వడ్డీ 37,340 వేల కోట్లు చెల్లించాలి. అంటే గత సంవత్సరం మార్చి నెల నుండి బాండ్స్ గడువు తీరినవి తిరిగి చెల్లించడం మొదలయ్యింది. ఈ చెల్లింపులు 2026 మార్చి నెల వరకు గడువు తీరినవి తీరినట్లు చెల్లిస్తూ పోవాలి.
ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్ ధరలు 2005-2010 ల మధ్య పెట్రో బాండ్స్ ద్వారా తీసుకున్న అప్పుని తీర్చడానికే తప్పితే చమురు సంస్థల లాభాల కోసం కాదు.
ఇక ప్రతి సంవత్సరం చమురు సంస్థల ఉద్యోగుల జీతాలు పెరుగుతూనే ఉంటాయి అలాగే పెట్రోల్ బంక్ నిర్వహుకులకి ఇచ్చే కమీషన్ కూడా పెంచాల్సిందే ! ఈ భారం నేరుగా వినియోగదారుల మీదనే పడుతుంది.
అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్నప్పుడల్లా వెంటనే ధరల పెంచుకునే డైనమిక్ సిస్టం ని 2010 లో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టాడు. అయితే ఈ వెసలుబాటు ఇచ్చింది పెట్రోల్ కి మాత్రమె ! 2014 లో డీజిల్ మీద కూడా డైనమిక్ సిస్టం ని అమలు చేయడానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం ! 2017 అక్టోబర్ నెల నుండి పూర్తిగా డైనమిక్ సిస్టం ని అమలులోకి తెచ్చారు. అంటే రోజువారి ధరలని నిర్ణయించడం అన్నమాట!
~ పార్ధసారధి పోట్లూరి
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)