అంతమంది పోలీసులుంటే అమృత్ పాల్ ఎలా పారిపోయాడంటూ పంజాబ్ పోలీసులపై పంజాబ్ – హరియానా హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖలిస్థాన్ నాయకుడు అమృత్ పాల్ ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన్ని పోలీసులు నిర్బంధించారని, విడుదలకు ఆదేశాలివ్వాలని దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా అమృత్ పాల్ పరారీలోనే ఉన్నట్టు పోలీసులు తెలపగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇది కచ్చితంగా పోలీసు వ్యవస్థ వైఫల్యమేనని ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగం తీరును తీవ్రంగా తప్పుబడింది ధర్మాసనం. 80,000 మంది పోలీసులు ఉండి ఏం చేస్తున్నారని… ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యమేననీ అంది.అయితే అతని సహచరులను 120 మందిని అదుపులో తీసుకున్నామని పోలీసులు కోర్టుకు వివరణ ఇచ్చారు.
జలంధర్లోని షాకోట్ తహసిల్కు తన కాన్వాయితో అమృత్పాల్ వెళుతున్నట్టు సమాచారం అందుకున్న రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాల సహకారంతో పట్టుకోవాలనుకున్నారు. అమృత్ పాల్ వాహనాన్ని 25 కిలోమీటర్లు వెంబడించారు. అయితే, ఇరుకు రోడ్లు, రద్దీలో అతను తప్పించుకున్నాడు. కొన్నేళ్లుగా పంజాబ్లోనే ఉంటున్న అమృత్ పాల్ ఆయుధాలుధరించిన అనుచరుల ఎస్కార్టుతో స్వేచ్ఛగా తిరిగేవాడని చెబుతున్నారు. శనివారం సాయంత్రం కూడా జలంధర్లో మోటార్ సైకిల్ వేగంగా వెళ్తుండగా చూశామని మరికొందరు తెలిపారు.
మరోవైపు అమృత్ పాల్ సింగ్ పై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (NSA) కింద పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, తప్పించుకుని పారిపోయే క్రమంలో అమృత్పాల్ ఉపయోగించిన రెండో కారును పంజాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అతని దుస్తులు కనిపించాయి. పోలీసులు గాలిస్తున్నట్టు తెలియడంతో అమృత్ పాల్ తన మెర్సిడెస్ వాహనాన్ని వదిలేసి బ్రెజా కారులో మరో దారిగుండా పారిపోయినట్టు సమాచారం. పంజాబ్ సరిహద్దుల్నీ దాటేసి ఉంటాడనీ అనుమానిస్తున్నారు. ఇక అమృత్ పాల్ వ్యవహారంతో నెలకొన్న హైటెన్షన్ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రజలకు భరోసా కల్పించేందుకు జలంధర్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పంజాబ్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.