కొంతకాలంగా బీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ…ఇటీవలే పార్టీనుంచి సస్పెన్షన్ కు గురైన ఖమ్మంజిల్లాకు చెందిన సీనియర్ నేత,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దారి ఎటువైపు? వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థినీ గెలవనీయను, అసెంబ్లీలో అడుగుపెట్టనీయను అన్న ఆయన తన శపథం నెరవేర్చుకుంటారా? ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ దూకుడును ఒంటరిగానే అడ్డుకునే సత్తా ఆయనకుందా? లేక కేసీఆర్, బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు ఆయన ఎవరితోనన్నా చేతులు కలుపుతారా? ఆయన వెళ్లేది కాంగ్రెస్ పార్టీతోనా, కమలం పార్టీతోనా? ఇలా ఎన్నో ప్రశ్నలు.
వ్యాపారవేత్తగా ఉండి రాజకీయ అరంగేట్రం చేసిన పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. బీఆర్ఎస్ కు దూరం అయిననుంచే కాంగ్రెస్, బీజేపీలు ఆయన్ని తమవైపు లాక్కునే ప్రయత్నాలు గట్టిగానే చేశాయి. ఆయన్ని చేర్చుకుంటే ఖమ్మంలో పార్టీ మరింత బలపడుతుందని కాంగ్రెస్… అంతంతమాత్రం ఉనికిలో ఉన్న పార్టీకి పొంగులేటితో కొత్త ఊపిరి వస్తుందనే ఆశతో బీజేపీ ఉన్నాయి.
కాంగ్రెస్ అగ్రనేతలు పలుదఫాలుగా ఆయనతో చర్చలు కూడా జరిపారు. వస్తే..ఆయనతో పాటు.. ఆయన అనుచరవర్గానికీ ప్రాధాన్యత ఉంటుందని హామీఇచ్చారు. అయితే పొంగులేటి కోరికలు వేరేలా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని మధిర మినహా మిగిలిన 10 స్థానాలు తనకే ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అంతేకాదు ఖమ్మం పార్లమెంట్ సీటును సైతం కోరుతూ ప్రతిపాదన ఉంచారట. అంతేకాదు ఖమ్మంతోనే ఆగక సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాన్ని సైతం తనకివ్వాలని అడిగార్ట. ఎందుకంటే ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పొంగులేటికి చెందిన ఇద్దరు మట్టా దయానంద్, పిడమర్తి రవి అసెంబ్లీలో అడుగుపెట్టాలని కుతూహలంతో ఉన్నారు. దీంతో ఇద్దరిలో ఒకరికి సత్తుపల్లి టికెట్ ఇప్పించి..మరో రిజర్వుడ్ స్థానమైన కంటోన్మెంట్ నుంచి మరొకరిని బరిలో దింపే యోచనలో ఉన్నారాయన.
అయితే పొంగులేటి గొంతెమ్మ కోర్కెలు సీనియర్లను చికాకు పెడుతున్నాయట. జిల్లాకు చెందిన సీనియర్లు భట్టివిక్రమార్కతో పాటు రేణుకాచౌదరి ఆయన డిమాండ్లపై అభ్యంతరం, అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. ఉన్న అన్నిస్థానాలు ఆయన వర్గానికి కేటాయిస్తే ముందునుంచి ఉన్నవాళ్లు, సీనియర్ నాయకుల పరిస్థితేంటని కార్యకర్తలూ చర్చించుకుంటున్నారు. ముందైతే పార్టీలో చేరండి, టికెట్ల విషయం తరువాత చర్చిద్దామని కొందరు సీనియర్లు ఆయనకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారట. అయితే స్పష్టమైన హామీ ఇస్తేనే వెళ్లే యోచనలో ఆయన ఉన్నారని తెలుస్తోంది.
అటు బీజేపీ సైతం పొంగులేటిని చేర్చుకునేందుకు గట్టిప్రయత్నాలే చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమలం పార్టీకి ఆయన అదనపు బలం అవుతారని లెక్కలు వేస్తోంది. బీజేపీలో చేరితో ఎలా ఉంటుందని అనుచరుల అభిప్రాయాన్నీ ఆయనతెలుసుకుంటున్నారట. అసెంబ్లీలో అనుకున్న ఫలితాలు రాకపోయినా, వచ్చేసారీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపే కనుక ఖమ్మంపార్లమెంట్ నుంచి గెలిస్తే కేంద్రమంత్రిగా అవకాశం వస్తుందన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో చాలామంది ఆయన అనుచరులు, అభిమానులు మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తేనే తమకూ భవిష్యత్ ఉంటుందని ఆయనతో స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. దీంతో పొంగులేటి ఆచితూచి అడుగువేస్తున్నారు. అందరితోనూ చర్చించి…ఈ నెలాఖరులోగానే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. చూడాలి ఖమ్మం రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో…