
TMC leader Diptiman Ghosh
పశ్చిమ బెంగాల్లో ఘోరం జరిగింది. అప్పుల బాధతో ఓ మైనర్ ను తండ్రి అమ్మివేయగా టీఎంసీ నాయకుడు, ఆయన సహచరులు బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో నిందితుడు టీఎంసీకి చెందిన పంచాయతీ సభ్యుడు దీప్తిమాన్ ఘోష్, బాధితుడి తండ్రి సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి తండ్రి ప్రధాన నిందితుడికి లక్ష రూపాయలు బాకీ ఉన్నాడు. దీంతో ఆ మొత్తానికి కుమార్తెను తనకే అమ్మేశాడు కర్కశ తండ్రి. తరువాత ఆ ఆదివాసీ బాలికపై టీఎంసీ నాయకులు తన సహచరులతో కలిసి అత్యాచారం చేశాడు.బీర్బూమ్ జిల్లా బోల్పూర్లోని సియాన్ ముల్క్ ప్రాంతంలో ఈ దారుణం వెలుగుచూసింది.
అప్పు తీర్చలేకే ఈఏడాది మార్చి 31లో కుమార్తెను ఘోష్ కు అప్పగించినట్టు బాధితురాలి తండ్రి తెలిపాడు. అసలైతే ఆరోజే బాలికపై అదే రోజు అత్యాచారం చేశాడు దీప్తిమాన్ . తరువాత ఆమె పరిస్థితి విషమించడంతో అత్త ఇంటికి వెళ్లింది.
ఎక్కడ పరువు పోతుందోనని భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తిరిగి బోల్పూర్ వచ్చిన తరువాత మరో ముగ్గురు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అయితే ఈవిషయం బాలిక తండ్రికి తెలుసని చెబుతున్నారు. తండ్రి సపోర్టు లేకపోవడంతో బాలిక వరుసకు సోదరి అయిన మరో యువతి దగ్గర విషయం చెప్పి వాపోయింది. ఆమె సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో ఉంది.
తనపై జరిగిన లైంగిక దాడితో బాలిక షాక్ లోకి వెళ్లినట్టు సమాచారం. ఆహారం కూడా తీసుకోవడం లేదని వైద్యులు తెలిపారు. బోల్పూర్ సబ్ డివిజనల్ ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం కోల్ కతాలోని సేధ్ సుఖ్ లాల్ కర్నానీ మెమొరియల్ ఆస్పత్రికి బదిలీచేశారు.బాలిక శారీరక, మానసిక స్థితిని పరిశీలించేందుకు ఓ మానసిక వైద్యుడు, గైనకాలజిస్టును ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 12 న గ్యాంగ్ రేప్ తరువాత బాలికకు తీవ్ర రక్తస్రావం అయింది. రక్తస్రావాన్ని ఆపేందుకు వైద్యులు చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చింది.