వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు భారీ భద్రతను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంన్నట్లు సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ తెలిపారు. ఎనిమిది విడుతల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల బందోబస్తు కోసం మొత్తం 725 కంపెనీలకు చెందిన సాయుధ బలగాలను రంగంలోకి దించుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే 495 కంపెనీల బలగాలు బెంగాల్లో ఉన్నాయని.. ఒక్కో కంపెనీలో 72 మంది భద్రతా సిబ్బంది ఉంటారని వివరించారు.
కాగా, ఇటీవల బీజేపీ ఎంపీ ఇంటిపై నాటు బాంబులతో దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుచోట్ల పెద్ద ఎత్తున నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముఖ్యంగా బీజేపీ నేతలే లక్ష్యంగా నాటు బాంబులతో దాడులకు దిగుతున్నారని.. బీజేపీ పార్టీకి చెందిన అగ్రనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడులన్నీ అధికార పార్టీకి చెందిన టీఎంసీ గుండాలే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.