మత మార్పిడి నిరోధక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది కర్నాటక ప్రభుత్వం. అక్రమ మతమార్పిడులకు పాల్పడుతున్న పాస్టర్లు, చర్చిలపై హిందుత్వ సంస్థల ప్రతినిధుల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో మతమార్పిడి నిరోధక బిల్లును తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. అయితే బిల్లు ప్రవేశపెట్టాలనుకుంటున్నట్టు ప్రభుత్వం పేర్కొన్ననాటినుంచే దాడులు పెరిగాయని క్రైస్తవ సంఘాలు అంటున్నాయి. అయితే బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని కొత్త చట్టం మరింత పటిష్టం చేస్తుందని సీఎం బస్వరాజ్ బొమ్మై అన్నారు.
“ప్రేరేపణ ద్వారా మత మార్పిడులను నిరోధించడానికి మాత్రమే ఈ బిల్లు” అని బొమ్మై ఆదివారం హుబ్బల్లిలో స్పష్టం చేశారు. ఒడిశా ఆమోదించిన ఇలాంటి చట్టాన్ని న్యాయ శాఖ అధ్యయనం చేస్తోందని అన్నారు.
ముసాయిదాను మంత్రివర్గం ముందు ఉంచుతామని ఆమోదం పొందాక సెషన్లో ప్రవేశపెడతామని తెలిపారు. అయితే బీజేపీ సర్కారు ఈ బిల్లును ముందుకు తీసుకురావడంతో విపక్షాలతో పాటు మైనారిటీ సంఘాలు, ముఖ్యంగా క్రైస్తవ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మైనారిటీల హక్కులకు ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకమని కేరళ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పదేపదే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
“బలవంతపు మతమార్పిడుల నిరోధానికి ఇప్పటికే ఓ చట్టం ఉండగా…కొత్త చట్టం అవసరమేంటని…ఇది కేవలం మైనారిటీలను వేధించడం, వారిపై దాడులను ప్రోత్సహించడం కోసమే’ అని శివకుమార్ అన్నారు. అయితే
ఈ బిల్లు ఆమోదంపై తాము నమ్మకంగా ఉన్నామని… పంచాయత్ రాజ్ శాఖ మంత్రి కె.ఈశ్వరప్ప అన్నారు. “శాసన మండలిలో ప్రతిపక్ష నేతలను ఎదుర్కోవాలంటే మనం మెజారిటీ సీట్లు గెలవాలి. మతమార్పిడి నిరోధక బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ అన్నారు. తమ వర్గీయులు మతం మారడం పట్ల తాము ఆందోళన చెందుతున్నామని వీరశైవులంటున్నారు. దక్షిణ కన్నడ జిల్లాలో విస్తృతంగా వ్యాపించిన లవ్ జిహాద్ కారణంగా చాలా మంది హిందూ యువతులను మతం మార్చుకుని మోసపోయారు. వీటన్నింటి గురించి శివకుమార్ కు తెలియకుంటే వివరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అన్నారు.
కర్ణాటకలో ముఖ్యమంత్రి మతమార్పిడి నిరోధక చట్టాన్ని ప్రవేశపెడతామని సీఎం అన్నప్పటి నుంచే తమపై దాడులు పెరిగాయని క్రైస్తవ సంఘాలంటున్నాయి. అయితే రాష్ట్రంలోని హిందువులను ప్రలోభపెట్టి మతమార్పిడికి గురిచేస్తున్నారని పలువురు బీజేపీ నేతలు కొంతకాలంగా ఆందోళనలు చేస్తూ వస్తున్నారు.
సెప్టెంబరులో జరిగిన శాసనసభ సమావేశాల సందర్భంగా హోసదుర్గ నుండి బిజెపి శాసనసభ్యుడు గూలిహట్టి శేఖర్ ముందు గళమెత్తారు. అంతకుముందు ఆయన మతమార్పిళ్లకు సంబంధించి రాష్ట్రంలో సమగ్ర సర్వే నిర్వహించారు.
“వెనుకబడిన తరగతుల ప్రజలు, పేద కుటుంబాల ప్రజలను మతమార్పిడులకు ప్రలోభపెడుతున్నారు. 2008లో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సామాజికవర్గం (లంబానీ) ప్రజలను ప్రలోభపెట్టి మతమార్పిడి చేసేవారు. జోక్యం చేసుకున్నందుకు నన్ను బెదిరించారు కూడా. ఇప్పుడు కేసులు పెరిగాయి, ”అని శేఖర్ పలు సందర్భాల్లో ఆవేదన చెందారు.
ఈ తరహా చట్టాన్ని తీసుకువచ్చిన ఇతర రాష్ట్రాల్లో చట్ట నిబంధనలను పరిశీలించి బిల్లును ప్రవేశపెడతామని కర్నాటక హోంమంత్రి మంగళవారమే స్పష్టం చేశారు. కర్ణాటకలో మతమార్పిడులు ముమ్మరంగా సాగుతున్నాయని, తన తల్లి మతం మారి క్రైస్తవం స్వీకరించిందని ఎమ్మెల్యే గూలిహట్టి శేఖర్ అసెంబ్లీలో పేర్కొన్న నేపథ్యంలో సీరియస్ గా దృష్టి పెట్టి చట్టం తీసుకురావాలనుకున్నామని ప్రభుత్వం తెలిపింది.
తన తల్లికి లేనిపోనివి నూరిపోసి క్రైస్తవంలోకి మార్చారు…హోసదుర్గ నియోజకవర్గంలో క్రైస్తవ మిషనరీలు పెద్ద ఎత్తున మతమార్పిళ్లకు పాల్పడుతున్నాయి.దాదాపు 18,000 నుంచి 20,000 మంది హిందువులను తమ మతంలోకి చేర్పించాయని శేఖర్ లెక్కలతో సహా చెబుతున్నారు. తన తల్లి నుదుటిపై బొట్టును చెరిపేసి మతం మార్చారని అసెంబ్లీలోనూ చెప్పారాయన.