తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన రాజకీయ పార్టీలు జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టిసారించాయి. ఈ మేరకు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి.
జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకవర్గం గడువు 2021 ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుంది. ఈలోగానే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి ప్రకటించారు. గత ఎన్నికల్లో 99 డివిజన్లు కైవసం చేసుకుని సత్తా చాటిన టీఆర్ఎస్.. ఈసారి కూడా మేయర్ పదవి తామే దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు దుబ్బాక ఉపఎన్నికల ఫలితంతో మంచి జోరు మీదున్న బీజేపీ గ్రేటర్ లో కూడా కాషాయం జెండా ఎగురవేసేందుకు సిద్ధమైంది. బల్దియాలో మేయర్ పదవి తమదేనని భారతీయ జనతా పార్టీ నేతలు పేర్కొంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే దశలవారీగా టెలీ, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి క్షేత్రస్థాయిలో కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఈసారి సర్వే నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారని బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. పలు డివిజన్లలో సంజయ్ పాదయాత్ర చేసే యోచనలో ఉందని సమాచారం. గత ఎన్నికల్లో కేవలం నాలుగు డివిజన్లకే పరిమితమైన బీజేపీ ఈసారి 80 డివిజన్లకు పైగా దక్కించుకుని మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని డిసైడ్ అయ్యింది.
అధికార టీఆర్ఎస్ కు ఇప్పుడు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా మారింది. దుబ్బాక ఫలితం గ్రేటర్ హైదరాబాద్పై పడుతుందన్న విశ్లేషణ ముందు నుంచే ఉంది.
‘గోల్కొండపై కాషాయ జెండా ఎగురవేస్తాం’ అన్నని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం మరితం రెట్టింపు అయ్యింది. పక్కా ప్రణాళికల అమలు చేసి దుబ్బాకలో ఎలాగైతే గెలిచారో అదే జోరును బీజేపీ జీహెచ్ఎంసీలోనూ చూపాలని అనుకుంటోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ 99 సీట్లలో ప్రాతినిధ్యం వహిస్తోంది. వీటిలో 30కి పైగా కార్పొరేటర్లపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దానిని అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోంది. మైనారిటీల ప్రభావం లేని ప్రాంతాలపై బీజేపీ దృష్టిసారించింది.
దుబ్బాక తీర్పుతో టీఆర్ఎస్ కార్పొరేటర్లు, శ్రేణుల్లో ఆందోళన పెరిగింది. బీజేపీ ఎదురు దాడిని తట్టుకుంటూ గెలవడం కత్తి మీద సామేనని భయపడుతున్నారు. టీఆర్ఎస్ అసంతృప్తులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం బీజేపీ గాలి వీస్తుండడంతో టీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు. కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల పరిధి డివిజన్లతో పాటు అంబర్పేట, గోషామహల్, ముషీరాబాద్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు ఉండే అవకాశం ఉంది. ఖైరతాబాద్లో కూడా బీజేపీ వైపు మొగ్గుతున్నవారి సంఖ్య అధికంగానే ఉంది. శేరిలింగంపల్లితో పాటు పలు డివిజన్లలలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మొత్తానికి ఈ సారి బీజేపీ బల్దియా మేయర్ పీఠంపై కషాయ జెండా ఎగురువేయాలని ఫిక్స్ అయ్యింది.