కర్నాటకలో మొదలైన హిజాబ్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ముఖర్రం ఖాన్ వివాదాస్పద ప్రకటన చేశారు. తమ పిల్లలను హిజాబ్ ధరించకుండా ఆపేవారిని ముక్కలు ముక్కలు చేస్తామని ఆయన బెదిరించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
విద్యాసంస్థల్లో మతపరమైన చిహ్నాలుగా ఉండే దుస్తులను నిషేధిస్తూ కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా హిజాబ్ గొడవ సద్దుమణగకపోగా ఎక్కువవుతోంది. కర్నాటకలో కాలేజీలకు కొందరు హిజాబ్ తో వెళ్తున్నారు. అయితే కాలేజీ లోపలకు వారిని రానివ్వడం లేదు. దీంతో అలాంటి వారిని ముక్కలుగా నరుకుతానంటూ కాంగ్రెస్ నాయకుడు బెదిరించడం కలకలం రేపుతోంది.
ముఖర్రం ఖాన్ కర్ణాటకలోని కలబురగి జిల్లా సేడంకు చెందిన నాయకుడు. ముఖర్రం ప్రకటనపై పలువురు మండిపడుతున్నారు. గొడవకు పరిష్కార మార్గం చూపాల్సింది పోయి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయన స్వగ్రామం కలబుర్గిలోని సేడం పోలీస్ స్టేషన్ ఎదుట పలువురు నిరసనకు దిగారు. ముఖర్రంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “ఇరు వర్గాల మధ్య ద్వేషం పెంచే మాటలు ఆయన మాట్లాడారని… సమాజంలో అశాంతికి కారణమయ్యే అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
అటు హిజాబ్ వ్యవహారంపై యూపీ సీఎం యోగీ స్పందించారు. హిజాబ్ ధారణ ముస్లిం మహిళల వ్యక్తిగత అంశమని అయితే… విద్యాలాయాల్లో క్రమశిక్షణలో భాగంగా నిర్థిష్టమైన డ్రెస్ కోడ్ ను పాటించాల్సిందేనని అన్నారు. విద్యాసంస్థల్లో చదివే పిల్లలకు మత పరమైన గుర్తింపు అవసరం లేదనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు యోగీ.