నయా పాకిస్తాన్ అంటూ అధికారం చేపట్టాక కొన్నిరోజుల పాటు హడావుడి చేసిన ప్రదాని ఇమ్రాన్ కొత్తపాట అందుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ పాలసీ అంటూ మళ్లీ దేశం ముందుకొస్తున్నారు. ఈ మేరకు సిద్ధం చేసిన తోలి భద్రతా విధానాన్ని జనవరి 14న ఇమ్రాన్ ఖాన్ఆవిష్కరించనున్నారు. పలు రంగాలకు సంబంధించిన డాక్యుమెంట్లతో వందపేజీలతో పాలసీ ఉండబోతోంది. ఈ నూతన విధానం పాకిస్తాన్ ఆర్థిక రంగం సహా అన్ని రంగాల్లో లక్ష్యాలను సాధించడంతో పాటు… దేశ సర్వతోముఖాభివృద్దికి తోడ్పడుతుందని అంచనావేస్తున్నారు. పాలసీ ఫస్ట్ పేజీని జతచేస్తూ ట్విట్టర్ వేదిగ్గా హర్షం వ్యక్తం చేశారు ఇస్లామాబాద్ పాలసీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హుస్సేన్ నదీం.
నేషనల్ సెక్యూరిటీ పాలసీకి సంబంధించి పబ్లిక్ వర్షన్ పై చర్చనడుస్తోంది. అయితే శుక్రవారం లాంఛ్ అవుతున్నది మొత్తం పాలసీ కాదని వివరణిచ్చారు అధికారులు. ప్రతిఏటా, ప్రభుత్వాలు మారే సమయంలో దానిపై సమీక్ష ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 28న పాక్ ఫెడరల్ కేబినెట్… పాలసీని ఆమోదించింది. మరుసటి రోజు జాతీయ భద్రతా కమిటీ ఆమోదించింది. రాబోయే రోజుల్లో దేశానికి ఈ నూతన పాలసీ దిశానిర్దేశం చేస్తుందని చెబుతున్నారు.
పాకిస్తాన్ కు డిఫెన్స్, విదేశీ, అంతర్గత విధానాలకు సంబంధించిన పాలసీలు విడిగా ఉండేవని..ఇప్పుడవన్నీ నేషనల్ సెక్యూరిటీ పాలసీ అనే ఒకే గొడుగుకింద పనిచేస్తాయని ఉన్నతాధికారులు తెలిపారు.
పాక్ తీరు భారత్ కు ఎప్పుడూ చిరాగ్గానే ఉంటోంది. అయితే ఈ నూతన భద్రతా విధానం ముఖ్య ఉద్దేశం పొరుగుదేశాలతో శాంతిని కొరడమేనని ఆ దేశం అంటోంది. భారత్ తోనూ శతృత్వాన్ని కోరడం లేదని…కానీ మోదీ ప్రధానిగా ఉన్నంతవరకు ఏ విధమైన సంబంధాలు పెట్టుకోకూడనే విధానంతో పాక్ ఉన్నట్టు తెలుస్తోంది. భారత్ లో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉన్నంతవరకు భారత్ తో సన్నిహిత సంబంధాలు ఏర్పడే అవకాశాల్లేవని ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు స్వయంగా పాకిస్తాన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
2019 ఆగస్టులో కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దైన నుంచి ఇరు దేశాలమధ్య అంతంతమాత్రంగానే ఉన్న వాణిజ్య, వ్యాపార సంబంధాలు నిలిచిపోయాయి. భారత్ తో దౌత్య సంబంధాలు తగ్గించుకోవడంతో పాటు..ద్వైపాక్షిక వాణిజ్యాన్నీ నిలిపేసింది. దేశం ఏర్పడి, స్వాతంత్ర్యం వచ్చిన 35 సంవత్సరాలకు కానీ వారి భద్రతా విధానం భారత్ కేంద్రంగా ఉందని గమనించలేకపోయింది పాకిస్తాన్. ఫలితమే 1948, 1965 మరియు 1971లో మూడు పెద్ద యుద్ధాలు. జిహాదీ ఆలోచనా విధానంతో పాక్ సైనిక నాయకత్వం తీవ్రం గా ప్రభావితం అయిందని విమర్శలు వచ్చాయి. నాటి నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే వస్తోంది. ఆ విమర్షలు ప్రపంచదేశాలనుంచి చుట్టుముడుతూ దేశం ఏకాకి అయిన పరిస్థితుల్లో ఈ నేషనల్ సెక్యూరిటీ పాలసీ అంటూ కొత్తపాట అందుకుందిప్పుడు పొరుగుదేశం.