ఒకప్పటి కల్లోల కశ్మీరంలో ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. 370 ఆర్టికల్ ఎత్తివేత తరువాత లోయలోని పౌరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే ప్రయత్నం చేస్తోంది భారత ప్రభుత్వం. అందులోభాగంగా మౌలికసదుపాయాలు సహా ఇతరాలపై కేంద్రం దృష్టి సారించింది. మరోవైపు దశాబ్దాలుగా తాము అనుభవించిన నరకం గురించి మొదటిసారి నోరు విప్పారు అక్కడి మహిళలు. తీవ్రవాదులు తమనెలా వేధించారో చెబుతున్నారు.
మిలిటెంట్లు వాళ్ల పట్ల ప్రవర్తించిన తీరు, మహిళలపై అత్యాచారాలు, తమ ఇంట్లోని మగవాళ్ల హత్యల గురించి చెబుతున్నారు. వారి నేరాలు, ఘోరాల గురించి బాధిత మహిళల రోదనను ది డిప్లొమాట్ ప్రచురించింది.
అమ్మాయి కనిపిస్తే చాలు తీసుకెళ్లి అత్యాచారాలు చేసేవారని కన్నీటిపర్యంతమయ్యారు వాళ్లంతా. జిహాద్ అంటూ ఉన్నతులం తామేనంటూ చెపుతూనే… తమను ఎలా వేధించారో చెబుతూ వాపోయింది బాధితుల్లో ఒకరైన బిస్మా.
లోయలో ఇస్లామిక్ టెర్రరిస్టులతో లైంగిక వేధింపులకు గురైన బాధితులు ఇంకా చాలా విషయాలు చెప్తూ బోరుమన్నారు. మిలిటెంట్లు మొదట్లో ఆహారం కోసం వచ్చేవారని అఫ్రోజా పేర్కొంది. ‘ముందు వాళ్లు ఆహారం, ఆశ్రయం కోసం వచ్చారు. తరువాత అది కావాలి, ఇది కావాలీ అని డిమాండ్ చేసేవాళ్లు. అన్నీ అందించేవాళ్లం. దీంతో తరచూ వచ్చేవారు. క్రమంగా ఇంట్లో గదినీ ఆక్రమించారు. మా చిన్న ఇంట్లో ఉన్నవి రెండుగదులే. వాటిలో ఓ గదిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఆడవాళ్లం వంటగదిలోనే ఉండేవాళ్లం. అయినా ఏదో ఓ నెపంతో పిలిచేవారు. నీళ్లు తెమ్మని, తినడానికి ఇంకేమైనా తెమ్మని అనేవాళ్లు. అప్పుడు నాకు 12 ఏళ్లు. ఏం జరుగుతున్నదో తెలియని స్థితిలో నన్ను లైంగికంగా వేధించారు. ఆ సమయంలో నేను ఎదుర్కొన్న శారీరక,మానసిక ఇబ్బంది అంతాఇంతా కాదు” అని చెప్పింది.
అప్పుడు ఆఫ్రోజా చెల్లెలికు 9 ఏళ్లు. ఆ పసిదాన్నీ మిలిటెంట్లు వదల్లేదు. తన పిల్లల్ని ఏం చేయవద్దని.. వదిలేయమని తండ్రి వేడుకుంటే… మరుసటిరోజు మార్కెట్ కు తీసుకెళ్లి బహిరంగంగా కాల్చిచంపారు.
కుప్వారాకు చెందిన బిస్మాది మరో దీనగాధ. ఆమె భర్త డ్రైవర్ గా పనిచేసేవాడు. ఇన్ఫార్మర్ నెపంతో అతన్ని చంపేశారు. తరువాత ఆమెను తీసుకెళ్లారు. చాలాకాలంపాటు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ చిత్రహింసలు, అవమానాలు మర్చిపోలేనని బిస్మా కన్నీటిపర్యంతమవుతూ బయటపెట్టింది.
నా భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఉన్నా… ఏమీ చేయలేని నిస్సహాయను. పలుమార్లు సామూహిక అత్యాచారం చేశారు. నాకు 18 ఏళ్ల వయసునుంచి 27 వరకు వారి అఘాయిత్యాలు కొనసాగాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు. ఆ సమయంలో నా మానసిక వేదన ఆ అల్లాకు మాత్రమే తెలుసని చెప్తూ ఏడ్చిది బిస్మా.
కశ్మీర్ లోయలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఎందుకు ఊరుకున్నారు, ఎందుకు కంప్లైంట్ చేయలేదు వారంతా చెప్పింది ఒక్కటే… “ఎవరికి ఫిర్యాదు చేయాలి, పేదలం, అశక్తులం. మేం చెప్పినా వినేవాళ్లెవరు’.
ఓ రోజు వాళ్ల గ్రామానికి వచ్చిన మిలిటెంట్లు ఏదో పని ఉందని… భర్తను తీసుకెళ్లారు. అంతకుముందు ఇంటికి వెళ్లి భోజనం పెట్టమనేవారు. ఇంట్లో ఏది ఉన్నా పెట్టేది. అప్పుడప్పుడు వాళ్లకు కూడా మిగిల్చకుండా తినేవారు. ఆ రోజు వాళ్లతో వెళ్లేందుకు నాభర్త ఒప్పుకోలేదు. దీంతో నా మీద ఆత్యాచారం చేయబోయారు అని చస్ఫీదా కన్నీరుమున్నీరైంది.
వాళ్లది ఏ వర్గమో.. ఏ పార్టీనో.. వాళ్ల లక్ష్యమేంటే మాకు తేలీదు. కానీ వాళ్లు చెప్పే మాటలు, ఖురాన్ బోధలు, అల్లా గురించి చెప్పడం అంతా అబద్ధం. ప్రజల్ని మోసం చేశారు వాళ్లు. పైకి మంచి మాటలు చెప్పినా వాళ్లెంతో దుర్మార్గులు. అది అల్లాకు తెలుసు. దాదాపు నాలుగేళ్లు వాళ్లు నన్ను వేధించారని వాపోయిందా అభాగ్యురాలు.
ఇక ఫాతిమా 2005లో గందరబాల్లోని వాళ్లింటికి మిలిటెంట్లు వచ్చారు. అప్పుడామె వయసు 14 ఏళ్లు.
నాపై ఎంతమంది అత్యాచారం చేశారో నాకే తెలీదు. ఆ చీకట్లో ఒకసారైతే దారుణం. నలుగురో ఎనిమిది మందో అర్థం కాలేదు. నా రక్తమాంసాలు పీల్చి పిప్పిచేశారు. కొన్నిరోజులకో ఎముకల గూడైపోయాను. ఆమెను చూస్తే ఎవరికైనా ఏడుపొస్తుంది. ఇలా ఎన్నో దీనగాథలు. మిలిటెంట్ల ఈ అకృత్యాలను బాధితులే స్వయంగా చెప్పినా ఏ మీడియాకూపట్టదనుకోండి.