లవ్ జిహాద్ , మత మార్పిడి లను అడ్డుకోవాల్సిన బాధ్యత విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ కార్యకర్తలదేనని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ మిలింద్ పరండే అన్నారు. ముష్కరుల నుంచి, దుర్మార్గుల నుంచి హిందుత్వాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన కర్తవ్యం మనదేనని ఆయన పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు రెండో రోజు సోమవారం కొనసాగాయి. రాష్ట్ర అధ్యక్షులు రామరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రతినిధులు పాల్గొన్నారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మిలింద్ పరండే గారు మాట్లాడుతూ మహిళలు, యువతులు లక్ష్యంగా కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తున్నాయని, వాటి బారి నుంచి హిందూ సమాజాన్ని రక్షించి జాగృతం చేయాలని సూచించారు. మహిళల రక్షణ తోనే భారతీయ సంప్రదాయం బతికి బట్ట కడుతుందన్నారు. ధర్మరక్షణ కోసం శక్తియుక్తులు గల కార్యకర్తల సమూహానికి విశ్వహిందూ పరిషత్ దగ్గర కొదువ లేదన్నారు. నేడు హిందూ సమాజం మేల్కొనకపోతే వచ్చే రోజుల్లో మరింత ప్రమాదం ఎదుర్కొని ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
1964 సంవత్సరంలో పురుడు పోసుకున్న విశ్వహిందూ పరిషత్ 2024 వ సంవత్సరంలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని షష్టిపూర్తి చేసుకుంటుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రతి పల్లెలో విశ్వహిందూ పరిషత్ , భజరంగ్ దళ్ కార్యకర్తలు హిందూ సమాజాన్ని ప్రభావితం చేయాలన్నారు. 60 సంవత్సరాల విశ్వహిందూ పరిషత్ దేశంలో అనేక గొప్ప విజయాలు సాధించిందని, వచ్చే రోజుల్లో మరిన్ని విజయాలు సాధిం చేందుకు కార్యకర్తల శ్రమిస్తున్నారని చెప్పారు. ప్రతి హిందువు మేల్కొన్నప్పుడే మత మార్పిడి మాఫియా అంతమవుతుందని వివరించారు. ధర్మ రక్షణలో విశ్వహిందూ పరిషత్ తో పాటు ప్రతి హిందువు బాధ్యతగా కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర కార్యదర్శి బండారు రమేష్, సంఘటన మంత్రి యాది రెడ్డి గారు, దక్షిణ భారత ఇంచార్జ్ స్థను మలై గారు, బెంగుళూరు క్షేత్ర ఇంచార్జ్ కేశవ్ హెడ్గే గారు మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా కొంతమందికి బాధ్యతల్లో మార్పులు చేశారు.
కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర సహ కార్యదర్శి శ్రీధర్ జి , VHP రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర రాజు, యాదగిరి రావు, సునీత రామ్మోహన్ రెడ్డి, భాస్కర్ రావు, లక్ష్మి శేఖర్, పగుడాకుల బాల స్వామి, సుభాష్ చందర్, కుమారస్వామి, శివరాం తదితరులు పాల్గొన్నారు.