వాక్సినేషన్ సర్టిఫికెట్ నుంచి ప్రధాని మోదీ ఫొటోను తొలగించాలనే అభ్యర్థనను కేరళ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఆ పిటిషన్ పనికిమాలినది అని వ్యాఖ్యానించింది. అది కేవలం రాజకీయ ప్రేరేపితమైందని, దీనివెనక రాజకీయ దురుద్దేశం మాత్రమే ఉందని…అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు…పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని వ్యాఖ్యానించింది.
ఆయన దేశానికి ప్రధానమంత్రి అని…అంతేకాని కాంగ్రెస్ ప్రధాని అనో, లేదా బీజేపీ ప్రధాని అనో ఎక్కడా చెప్పలేదని కోర్టు గట్టిగానే అంది. ఓ పార్టీ రాజకీయాలతో విభేదించవచ్చు కానీ…ఓ సందేశంలో ప్రధాని ఫోటో ఉంటే తప్పేంటని..దేశ ప్రధాని ఫొటో ఉన్న ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవడానికి సిగ్గెందుకని కోర్టు కామెంట్ చేసింది. తాము విధించిన లక్ష రూపాయల జరిమానా ఆరువారాల్లోగా కేరళ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథార్టీ (KELSA)కి జమ చేయాలని సూచించింది. సకాలంలో జమ చేయకపోతే..అతని ఆస్తులను విక్రయించైనా డబ్బులను రికవరీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
వేల సంఖ్యలో క్రిమినల్ అప్పీళ్లు, బెయిల్ పిటిషన్లు, సివిల్ సూట్లు, మ్యాట్రిమోనియల్ కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నప్పుడు, ఇలాంటి పనికిమాలిన పిటిషన్లు వేసి తమ సమయం వృధా చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ల కోసం ప్రజలు డబ్బులు చెల్లిస్తుంటే…సర్టిఫికేట్ పై ప్రధాని బొమ్మ ఉండడం ప్రాథమిక హక్కలు ఉల్లంఘన కిందకు వస్తుందని సమాచార హక్కు కార్యకర్త పీటర్ మ్యాలిపరం ఈ పిల్ వేశారు.
ఇతర దేశాల్లో వ్యాక్సిన్ సర్టిఫికేట్ లపై ప్రధాన మంత్రుల ఫొటోలు లేవని అతను అన్నప్పుడు కోర్టు తీవ్రంగా స్పందించింది… ప్రధానిని చూసి గర్వించాలనీ అన్నట్టు సమాచారం.
దేశ ప్రజలతో ఎన్నికై అధికారంలోకి వచ్చినప్పుడు… ప్రధానమంత్రి ఫోటో కోవిడ్ -19 టీకా సర్టిఫికేట్లలో ఉంటే తప్పేంటని రెట్టించినట్టు తెలిసింది. మీరు ప్రధానిని చూసి గర్వపడకపోవచ్చు., కానీ మన ప్రధానిని చూసి మేం గర్విస్తున్నాం అనీ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు ‘ప్రధానమంత్రిని చూసి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? అనీ నిలదీశారు న్యాయమూర్తి పిటిషనర్ ను.