కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలన పడకేస్తోంది. అధికార యంత్రాంగం లో ముందు చూపు కరువు అవుతోంది. దీంతో తెలంగాణ ప్రజలకు కష్టాలు వచ్చి పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ మహా నగరంలో సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. తాగు నీటికి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వెంటనే మేలుకొని ముందస్తు చర్యలు చేపట్టాలని, లేదంటే కష్టాలు తప్పవని చెబుతున్నారు.
హైదరాబాద్ అంతటా తాగునీటి వనరుల మీద లెక్కలు తీశారు. హైదరాబాద్ నగరంలో భూ గర్భ జలాలు అడుగంటినట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో చాలా వరకు భూగర్భ జలాలు అడుగంటినట్లు గుర్తించారు. కూకట్పల్లి ప్రాంతంలో అత్యధికంగా 25.9 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు వెళ్లినట్లు అధికారులు అంచనా వేశారు. మరోవైపు కూకట్పల్లి జోన్లో భారీ భవనాల నిర్మాణం వల్ల నీటి లభ్యత తగ్గిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మే చివరినాటికి ఇక్కడ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉందని భూగర్భజల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ వివరాలతో గత కాలపు లెక్కలను పోల్చి చూస్తున్నారు. గత ఏడాది తో పోలిస్తే.. భూగర్భ జలాలు గణనీయంగా తగ్గినట్టు తేలింది. గ్రేటర్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు 53 ప్రదేశాల్లో భూగర్భ జలాల వివరాలను విశ్లేషించారు. . ఈ విశ్లేషణలో గతేడాది జనవరి కంటే ఈ ఏడాది జనవరిలో భూగర్భ జల మట్టాలు 1.33 మీటర్లు తక్కువగా ఉన్నట్లు తేలింది. గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా 53 ప్రాంతాల్లో విశ్లేషించగా 33 ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గాయి.
వెంటనే అధికార యంత్రాంగం మేలుకొనాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే నీటి కష్టాలు తప్పవని చెబుతున్నారు. కొంత కాలం క్రితం బెంగళూరు లో వేసవి కాలంలోనే నీటి ఎద్దడి ఏర్పడి ప్రజలు అల్లాడిపోయారు.