మావోయిస్టు పార్టీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి కేశవరావు ఎన్ కౌంటర్ తర్వాత చాలా ప్రశ్నలు బయట పడుతున్నాయి. 50, 60 మంది దళ సభ్యుల మధ్య ఉండాల్సిన జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా దొరికిపోయాడు అనేది ప్రశ్న. కేశవరావుకి తెలియకుండానే కొన్ని బలగాలను అక్కడి నుంచి తప్పించారా అనేది మరో వాదన. అదే జరిగితే కేశవరావు పదవి కోసమే ఈ దొంగ దెబ్బ తీసారా,, అందుకోసమే అతన్ని బలి చేశారా అనే డౌట్ వ్యక్తం అవుతోంది.
ఈ బాధ్యత కోసం మరోసారి తెలుగు నక్సలైట్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు చెందిన సీనియర్ కమాండర్ చేపట్టే అవకాశాలున్నాయి.
…….
కేశవరావు మరణం తర్వాత మావోయిస్టు పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. పార్టీకి చెందిన కొందరు ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే పక్కా స్కెచ్ తో ఎన్ కౌంటర్ జరిగింది అని బయటపెట్టింది. అయితే పోలీసులకి లొంగిపోయిన మాజీ నక్సలైట్లు సమాచారం ఇచ్చారని మావోయిస్టు పార్టీ వాదిస్తోంది. కానీ పార్టీ లోపల ఉన్న కుమ్ములాటల వల్లనే కేశవరావుని బయటపెట్టేశారు అని మరో వాదన వినిపిస్తోంది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర నేతలు ఎన్కౌంటర్ అవడం ఒకటైతే ,, జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయిలోని దళపతి దొరికిపోవడం చాలా అరుదు. అందుచేత మావోయిస్టు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు విపరీతంగా ఉన్నాయి అని తెలుస్తోంది.
………..
పదవుల కొట్లాటకు చెక్ పెట్టాలి అంటే మరో మార్గం అన్వేషిస్తున్నట్లు సమాచారం.
బసవరాజు గురువు, మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కే దళపతి బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. వైద్య చికిత్స కోసం విదేశాల్లో తల దాచుకుంటున్న గణపతి కొద్ది రోజుల క్రితమే తిరిగి.. భారత దేశానికి వచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. 2018లో పక్కకు తప్పుకుని బసవరాజుకు బాధ్యతలు అప్పగించడానికి ముందు దాదాపు 15 ఏళ్ల పాటు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా గణపతి ఉన్నారు. కరుడుగట్టిన నక్సలైట్ అయిన గణపతి కి అనేక మారుపేర్లు ఉన్నాయి అలాగే వేషాలు మార్చడంలో కూడా దిట్ట. కొండపల్లి సీతారామయ్య మద్దతు దారుల నుండి నక్సల్ ఉద్యమాన్ని హస్తగతం చేసుకోవడంలో కీలక భూమిక వహించారు. రెండు కీలక నక్సల్ గ్రూపులను విలీనం చేసి,, మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసి, పార్టీ కి సారధ్యం వహించారు.
…
20 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో నక్సలైట్లు చర్చలు జరిపాయి. ఆ సమయంలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర నాయకుల్ని చర్చలకు పంపించింది ఈ గణపతే. ఇక్కడ చర్చలు జరుపుతూనే.. మరోవైపు ఆయుధాలు , చందాలు బలంగా వసూలు చేసి మావోయిస్టు పార్టీని పటిష్టం చేశారు. ఆ సమయంలోనే బలంగా రిక్రూట్మెంట్లు కూడా జరిగాయి. ఆ వ్యూహం ఫలించడంతో పదేళ్ళ పాటు గణపతికి పార్టీలో తిరుగు లేకుండా పోయింది. చివరికి అనారోగ్యం కారణంగా పదవ నుంచి తప్పుకుని శిష్యుడైన కేశవరావుకి బాధ్యతలు అప్పగించారు.
..
నిజానికి గణపతి కదలలేని స్థితిలో ఉన్నారు.
అనారోగ్యం కారణంగా చికిత్స, విశ్రాంతి కోసం ఇన్నేళ్లు ఫిలిప్పీన్స్లో ఉన్నారు. ఎన్కౌంటర్లో బసవరాజు మరణించిన తర్వాత ఆయన దేశానికి తిరిగివచ్చారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సలహాదారుగా గణపతి ఉన్నారు. 70 సంవత్సరాలు దాటడంతో మావోయిస్టులకు అధిపతిగా ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టడం కష్టమే అని తెలుస్తోంది.
..
ఇక పోతే,,
బసవరాజు, గణపతి తర్వాత ఆ స్థానానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ పేరు బలంగా వినిపిస్తోంది . లేనిపక్షంలో
తెలంగాణకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పేరు చెపుతున్నారు. ఈ ఇద్దరు వద్దు అనుకుంటేనే.. జార్ఖండ్కు చెందిన మిషిర్ బెస్రా అలియాస్ భాస్కర్కి అవకాశం ఉంటుంది . అయితే మావోయిస్టు పార్టీలో తెలుగు వారి ప్రాబల్యం వల్ల ఇతరులకు నాయకత్వ బాధ్యతలు దక్కే అవకాశం కష్టమే.
…
మరోవైపు మావోయిస్టుల్లో అత్యంత ప్రమాదకారిగా చెప్పే హిడ్మా పోలీసులకు దొరికిపోయాడు. దీనికి కూడా మావోయిస్టుల అంతర్గత కుమ్ములాటలు కారణం అని చెబుతున్నారు. అందుచేత మావోయిస్టు పార్టీ నాయకత్వ స్థాయిలోనే బలమైన కుమ్ములాటలు ఉండటం వల్లనే కొంప ముసుగుతోంది అని భావిస్తున్నారు.