కమలనాథులకు ఇది వార్నింగ్ బెల్
కేంద్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నది. నవభారత నిర్మాణానికి నరేంద్ర మోడీ సర్కార్ అహర్నిషలూ పాటు పడుతున్నది. కానీ ఆ విషయం ప్రజలకు, న్యయవ్యవస్థకు తెలియజెప్పడంలో పార్టీ యంత్రాంగం చురుగ్గా లేదని అర్థమవుతుంది. పార్టీ నేతల నిర్లిప్తత వల్లే సాగు చట్టాలపై విపక్షాల అసత్యాలను ప్రజల్లో కొందరైనా నమ్మే పరిస్థితి వచ్చింది. సుప్రీంకోర్టు ముందు ఈ చట్టాలకు అనుకూలంగా ఒక్క పిటిషన్ కూడా దాఖలు కాలేదంటే బిజెపి పార్టీ యంత్రాంగం, సంఘ్ అనుబంధ కిసాన్ సంఘ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. మొత్తం మీద కొత్త వ్యవసాయ చట్టాలకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. సుప్రీంకోర్టు స్టే కారణంగా రైతుల నోటికాడికి వచ్చిన ఫలాలు నేలరాలినట్టయింది.
పంజాబ్ కు చెందిన వందల మంది రైతులం అని చెప్పుకొంటూ ట్రాక్టర్లమీద ఢిల్లీపై దండయాత్రచేశారు. పైగా సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ చట్టాలను రద్దు చేయాలని ఎంతో మంది అవార్డ్ వాపసీకి సిద్ధపడ్డారు. కానీ ఈ చట్టాలకు అనుకూలంగా ఒక్క పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో దాఖలు కాలేదు. కనీసం సంఘ్ పరివార్ సంస్థ భారతీయ కిసాన్ సంఘ్ కూడా ఈ చట్టాలను కొనసాగించాలంటే సుప్రీంకోర్టులో పిటిఫన్ వేయకపోవడం ఆశ్చర్యకరం.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సోమవారం నాడు ఇదే అంశం ప్రస్తావించారు. ఈ చట్టాలకు అనుకూలంగా తమ ముందు ఒక్క పిటిషన్ కూడా లేదన్నారు. బిజెపిలో పెద్ద పెద్ద పదవులు పొందిన వాళ్లలో చాలా మంది న్యాయవాదులే. వాళ్లు గానీ, వారికి మద్దతు పలికే వారు గానీ ఏ ఒక్కరూ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదు అని ఈ చట్టాలను సమర్థించే రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాలు చాలా రాష్ట్రాల్లో ఈ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నాయి. తెలంగాణ, ఏపీ, ఇతర రాష్ట్రాల్లో ఈ చట్టాలకు అనుకూలంగా ప్రదర్శనలు లేదా సభలను ముమ్మరంగా నిర్వహించాలనే వ్యూహం కమలనాథులకు తట్టలేదా? న్యాయ పోరాటంలో గెలవాలంటే మన వాదనను బలంగా వినిపించాలి. కొన్ని విపక్షాలు అబద్ధాలను కూడా డంకా బజాయించి చెప్తూ అనేక పిటిషన్లు దాఖలయ్యేలా చూశాయి. బిజెపి నాయకులు మాత్రం చట్టాలకు అనుకూలంగా తాము సైతం న్యాయపోరాటం చేయాలనే వ్యూహం గురించి ఆలోచించలేక పోయారు. ఇది వ్యూహాత్మక తప్పిదం అంటున్నారు పరిశీలకులు. కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలు, ధరణి వగైరా అంశాలపై తెలంగాణలో ధర్నాలు జరుగుతున్నాయి. మరో వైపు, కాంగ్రెస్ పార్టీ సాగు చట్టాలకు వ్యతిరేకంగ తెలంగాణ అంతటా ఆందోళనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ బిజెపి మాత్రం సాగు చట్టాలకు అనుకూలంగా ఒక ఉద్యమాన్ని నిర్మించడం అనేది ఎందుకు జరగలేదు? ఈ చట్టాలు ఉండాలి అని కోరుకునే రైతులు అడుగుతున్న ప్రశ్న ఇది.
భవిష్యత్తులో విపక్షాలు ఇలాగే రైతుల పేరుతో, ఇంకో పేరుతో ప్రభుత్వ నిర్ణయాలను, చట్టాలను అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి బిజెపి నాయగకణం రిలాక్స్ డ్ గా ఉండటం ప్రమాదకరం. వ్యూహాత్మకంగా, ప్రభుత్వానికి అడుగడుగునా సహాయకారిగా ఉండాలని ఆ పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి.