వక్ఫ్ బోర్డు వ్యవహారాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వము పార్లమెంటును బిల్లును ప్రవేశపెట్టింది. సహజంగానే దీనిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు చాలా గొడవ చేస్తున్నాయి. ముస్లింల హక్కులకు భంగం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది అంటూ ఆందోళన చేపట్టాయి. కానీ ఈ సవరణలను పరిశీలించి చూసినట్లయితే సాధారణ ముస్లింలకు మేలు కలిగించేవిగా ఉంటున్నాయి.
భారత ప్రభుత్వం 1995 వక్ఫ్ చట్టంలో భారీ మార్పులను ప్రతిపాదిస్తూ వక్ఫ్ సవరణ బిల్లు, 2024 ను ప్రవేశపెట్టింది. ఈ సవరణలు వక్ఫ్ బోర్డుల అధికారాలను పారదర్శకం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 8 లక్షల ఎకరాలకు పైగా భూమిని వక్ఫ్ బోర్డులు నిర్వహిస్తున్నాయి.
భారతదేశంలో రైల్వేలు మరియు రక్షణ మంత్రిత్వ శాఖ తర్వాత పెద్ద స్థలానికి యజమానులు వక్ఫ్ బోర్డులే అంటే ఆశ్చర్యం కలగక మానదు. వక్ఫ్ బోర్డు పేరు చెప్పి కొన్ని కోటీశ్వరులైన కుటుంబాలు.. విచ్చలవిడిగా ఆస్తులని అనుభవిస్తున్నాయి. దేశంలోని అత్యంత సంపన్నమైన భూముల్ని గుప్పెట్లో పెట్టుకుని ఆడింది ఆట పాడింది పాటగా వ్యవహారం సాగిస్తున్నాయి. సామాన్య ముస్లింలను అటువైపు చూడనీయకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
ప్రస్తుతానికి, భారతదేశవ్యాప్తంగా 30 వక్ఫ్ బోర్డులు విస్తారమైన ఆస్తులను నిర్వహిస్తున్నాయి. అయితే, వక్ఫ్ బోర్డులు ధ్రువీకరణ లేకుండానే.. ఏదైనా ఆస్తిని వక్ఫ్గా ప్రకటించడానికి చట్టం అనుమతిస్తున్నందున, పలు వివాదాలు చెలరేగాయి. పైగా ఈ వక్ప్ బోర్డులకు కోటీశ్వరులైన కొన్ని ముస్లిం కుటుంబాలే నాయకత్వం వహిస్తున్నాయి. సామాన్య ముస్లింలకు ఇందులో ప్రాతినిధ్యం ఉండటం లేదు. మహిళలను దగ్గరకు కూడా రానీయడం లేదు.
అందుచేతనే సవరణల బిల్లులో సాధారణ ముస్లింలకు ప్రాతినిధ్యం కలిగించేట్లుగా చర్యలు తీసుకున్నారు. ప్రతి బోర్డు లోను మహిళలు, చిన్న వర్గాల ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేశారు.
వక్ఫ్ ఆస్తి తప్పనిసరిగా జిల్లాకలెక్టర్ కార్యాలయంలో నమోదు చేయాలనే నిబంధనను బిల్లు పెట్టింది. దీని వల్ల వివాదాలు తగ్గిపోవడమే కాకుండా, సరైన రికార్డులు ఉంచడానికి సహాయపడుతుంది. ఒక నిర్దిష్టమైన ఆస్తి.. వక్ఫ్ లేదా ప్రభుత్వ భూమిగా పరిగణించాలా లేదా అని నిర్ణయించే అధికారం జిల్లా కలెక్టర్ కు ఉంటుంది. ఈ నిర్ణయం తుది నిర్ణయంగా ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు, వక్ఫ్ వివాదాస్పద భూమిని నిర్వహించడానికి వీలులేదు.
వక్ఫ్ ఆస్తిని ప్రభుత్వం ఎప్పుడైనా ఆడిట్ చేయడానికి అధికారం కల్పించారు. ఈ ఆడిట్లు, భారత నియంత్రణ మరియు ఆడిట్ జనరల్ లేదా కేంద్ర ప్రభుత్వం నియమించిన అధికారి చేత చేయిస్తారు. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ లో లోక్ సభ నుండి ఇద్దరు ఎంపీలు మరియు రాజ్యసభ నుండి ఒక ఎంపీ కలిపి మూడు ఎంపీలను చేర్చేందుకు ఈ బిల్లు ప్రతిపాదన చేసింది.
వక్ఫ్ బోర్డులో సవరణలు చేయడం ద్వారా కార్యకలాపాలను పారదర్శకం చేయడం జరిగింది. అంతేకాకుండా ముస్లిం సమాజంలోని అన్ని వర్గాలకు ముఖ్యంగా మహిళలకు సైతం ప్రాతినిథ్యం కల్పిస్తున్నారు. ఈ సవరణలతో ప్రాథమికంగా ముస్లిం సామాన్యులకే ప్రయోజనం కలుగుతుందని అర్థం అవుతుంది