ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్కర్ ఎన్డీయే అభ్యర్థిగానూ, కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ అల్వా ప్రతిపక్షాల అభ్యర్థిగానూ పోటీ చేస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ప్రస్తుత ఉప రాష్టపతి ఎం. వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగిసిపోనుంది.
మార్గరెట్ ఆల్వాకు కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, టీఆర్ఎస్, ఆప్ మద్దతు తెలుపుతున్నాయి. జేడీయూ, వైఎస్సార్సీపీ, బీఎస్పీ, ఏఐఏడీఎంకే, శివసేన వంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్డీయే అభ్యర్థికి 515 ఓట్లు పోలయ్యే అవకాశాలున్నాయి.
ఉభయ సభల్లోనూ 788 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అందరూ ఎంపీలే కావడంతో వారి ఓటు విలువ సమానంగా ఉంటుంది. మార్గరెట్ అల్వాకు దాదాపు 200 ఓట్లు (26 శాతం) లభించే అవకాశం ఉంది.